తుంగతుర్తి, డిసెంబర్ 22 : తుంగతుర్తి మండలంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతున్నది. గ్రామగ్రామాన వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి అర్హులకు టీకా వేస్తున్నారు. తొలి డోసు, రెండో డోసు వేసుకోని వారి వివరాలు సేకరిస్తున్నారు. గుడి, బడి, వీధులు, ప్రభుత్వ కార్యాలయాలు, పంట పొలాల్లోని కూలీల వద్దకు వెళ్లి టీకా వేస్తున్నారు. ఆరోగ్య సిబ్బంది సేవలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటివరకు 37 వేల మందిపైగా తొలి డోసు..
మండలంలో 23 గ్రామ పంచాయతీల్లో 40,112 మంది కొవిడ్ టీకా వేసేందుకు అర్హులని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించారు. వారిలో ఇప్పటి వరకు 37, 219 మందికి తొలి డోసు, 18,322 మందికి రెండోడోసు వ్యాక్సిన్ వేసినట్లు వైద్యాధికారి నాగూనాయక్ తెలిపారు. మిగిలిన వారికి సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ వేసేందుకు సిబ్బంది కృషి చేస్తున్నారు. ఉదయం 7 గంటలకే గ్రామాల్లోకి వెళ్లి రాత్రి 7 గంటల వరకు వీధుల్లో తిరిగి అర్హులందరూ వ్యాక్సిన్ వేసుకొనేలా అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో ఎవరూ కనిపించకుంటే పంట పొలాల్లోకి సైతం వెళ్లి రైతులకు, కూలీలకు టీకాలు వేస్తున్నారు. కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం నుంచి వైద్య, ఆరోగ్య సిబ్బంది ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మహమ్మారి నియంత్రణపై యుద్ధం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని, ప్రజారోగ్య సంరక్షణే ధ్యేయంగా పని చేయడం ఆనందంగా ఉందని సిబ్బంది చెబుతున్నారు.
వంద శాతం పూర్తి చేయడమే లక్ష్యం
వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు సిబ్బంది ఇంటింటికీ తిరిగి వ్యాక్సిన్ వేసుకోని వారి వివరాలు గుర్తిస్తున్నారు. టీకా వేసుకొని వారికి వెంటనే వేస్తున్నాం. కొందరు అపోహ కారణంగా వ్యాక్సిన్ వేసుకోవడం లేదు. కొవిడ్ నియంత్రణకు 18 ఏండ్లు నిండిన అందరూ టీకా వేసుకోవాలి. మండలంలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయడమే లక్ష్యంగా సిబ్బంది పని చేస్తున్నారు.
గడువులోగా లక్ష్యాన్ని పూర్తి చేస్తాం..
గ్రామగ్రామాన ప్రత్యేక డ్రైవ్లు ఏర్పాటు చేసి అర్హులందరికీ వ్యాక్సిన్ వేస్తున్నాం. ఈ నెలాఖరులోగా 100 శాతం వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. అందుకు అనుగుణంగా విశేష కృషి చేస్తున్నాం. క్షేత్రస్థాయిలోకి వెళ్లి 18 ఏండ్లు నిండిన వారికి టీకాలు వేస్తున్నాం. స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యావంతులు వ్యాక్సినేషన్ విజయవంతానికి సహకరించాలి.