ఎల్బీనగర్ : దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల మృతులకు సోమవారం పలువురు ఘనంగా నివాళులర్పించారు. దిల్సుఖ్నగర్ బాంబు దాడి ఘటన జరిగిన రోజును పురస్కరించుకుని దిల్సుఖ్నగర్ రాజీవ్ కోనార్క్ థియేటర్ రోడ్డులో బాంబుదాడిలో మరణించినవారికి ఘనంగా నివాళులర్పించారు.
2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్నగర్లో జంట బాంబు పేలుళ్లు జరిగాయి. బాంబు దాడి జరిగిన రోజు నేపథ్యంలో యాంటీ టెర్రరిస్టు ఫోరం ఆధ్వర్యంలో దిల్సుఖ్నగర్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సంఘాల నాయకులు బాంబు దాడులను ఖండించడంతో పాటుగా ఉగ్రవాదం నశించాలంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా యాంటీ టెర్రరిస్టు ఫోరం జాతీయాధ్యక్షుడు రవినూతల శశిధర్, పాపారావు, రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మచారి, సిటీ అధ్యక్షుడు గంగం నవీన్కుమార్లు మాట్లాడుతూ దేశం లోపల తీవ్రవాద మూలాలను అంతమొందించాలన్నారు.
బాంబు పేళుళ్లకు బాద్యులను గుర్తించి వారిని ఉరి తీయాలని, బాంబు దాడి బాదితులను ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రహీం, లంకా లక్ష్మీనారాయణ, మనోజ్, రాకేష్, వంశీ, బాబ్జీ, సంతోష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.