గద్వాల, జనవరి 3 : నడిగడ్డపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించడంతో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నది. గతంలో ఉన్న వంద పడకల ఏరియా దవాఖానను జిల్లా దవాఖానస్థాయికి పెంచడంతోపాటు 57రకాల వైద్యపరీక్షలు చేసేందుకు తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్ను ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. గతంలో ఇక్కడి రోగులు డయాలిసిస్ చేయించుకునేందుకు మహబూబ్నగర్కు వెళ్లే పరిస్థితి ఉండేది. పేదల ఇబ్బందులను తీర్చేందుకు ఇక్కడే డయాలిసిస్ కేంద్రం ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నారు. దవాఖానలో ఐసీయూ ఏర్పాటు చేయడంతో పేదలకు అత్యవసర చికిత్స అందుతున్నది. కరోనాను ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని వసతులను ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి సహకారంతో జిల్లా దవాఖానలో సమకూర్చారు. ఒకేసారి 350మందికి ఆక్సిజన్ అందించేలా ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నడిగడ్డలో మెరుగైన వైద్యం పేదలకు అందుబాటులోకి వచ్చింది.
నర్సింగ్ కళాశాల ఏర్పాటు
గతంలో ఇక్కడి విద్యార్థులు నర్సింగ్ కోర్సు చేయాలంటే ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఇప్పుడు విద్యార్థులకు అలాంటి కష్టాలు లేకుండా ప్రభుత్వం జోగులాంబ గద్వాల జిల్లాకు నర్సింగ్ కళాశాలను మంజూరు చేసింది. ఈ ఏడాది నర్సింగ్ కళాశాలను ప్రైవేట్ భవనంలో ప్రారంభించారు. ఇప్పటికే ఆన్లైన్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తైంది. ఇంటర్లో బైపీసీ చేసిన విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. నర్సింగ్ కళాశాలలో మొదటి ఏడాది 100మంది విద్యార్థినులకు అవకాశం కల్పించారు. వారికి హాస్టల్ వసతిని కూడా ప్రభుత్వం కల్పించింది. కళాశాల శాశ్వత భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.40కోట్లు మంజూరు చేసింది. భవన నిర్మాణానికి ఎమ్మెల్యే బండ్ల ఐదెకరాల స్థలం చూపించగా, ఇటీవల వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు భూమిపూజ చేశారు.
300 పడకల దవాఖాన నిర్మాణం..
ప్రస్తుతం జిల్లా దవాఖానలో 100 పడకలు ఉన్నాయి. దీనికి అదనంగా ప్రభుత్వం మరో 200 పడకలను మంజూరు చేసింది. ప్రస్తుతం దవాఖాన ఉన్నచోట స్థల ప్రభావంవల్ల దౌదర్పల్లి దర్గా సమీపంలో ఉన్న 39ఎకరాల స్థలంలో ఐదెకరాలు నర్సింగ్ కళాశాలకు కేటాయించారు. మిగతా 34 ఎకరాల్లో 300పడకల దవాఖాన నిర్మించనున్నారు. ఇందుకు ప్రభుత్వం రూ.43కోట్లు మంజూరు చేసింది. జిల్లా దవాఖానకు అదనంగా పడకలు మంజూరు కావడం, నర్సింగ్ కళాశాల ప్రారంభంతో నడిగడ్డకు మెడికల్ కళాశాల వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకు అవసరమైన స్థలాన్ని ఇప్పటికే ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి సహకారంతో అధికారులు గుర్తించారు. ఇవి అందుబాటులోకి వస్తే ఇక్కడి ప్రజలకు మెరుగైన వైద్యం అందే అవకాశం ఉంది. ప్రస్తుతం పీజీ కళాశాలలో ఈ ఏడాది నుంచి ఏంబీఏ కోర్సు ప్రారంభించారు. దీంతో నడిగడ్డ విద్యా, వైద్యంవైపు చకచకా అడుగులు వేస్తున్నది.
విద్యా, వైద్యాభివృద్ధికి కృషి
గత పాలకుల నిర్లక్ష్యంవల్ల జిల్లా అన్ని రంగాల్లో వెనుకబడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక నడిగడ్డ ప్రాంతంలో విద్యా, వైద్యరంగాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇక్కడి ప్రజలకు మెరుగైన వైద్యం, విద్య అందించడమే నా లక్ష్యం. నర్సింగ్ కళాశాల ఏర్పాటుతో పేద విద్యార్థినులకు ఎంతో మేలు చేకూరుతుంది. ప్రభుత్వం అందించే అవకాశాలను ప్రజలు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.