ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీలోని దళిత, గిరిజన విద్యార్థులకు టాప్ క్లాస్ స్కాలర్షిప్ అందించాలని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణకు వినతిపత్రం అందజేశారు. అనంతరం విద్యార్థి నేతలు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వ గిరిజన మంత్రిత్వ శాఖ, సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ అందిస్తున్న టాప్ క్లాస్ స్కాలర్షిప్లలో ఓయూ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, ఓయూకు న్యాక్ ఏ ప్లస్ గుర్తింపు ఉన్నా ఇక్కడి విద్యార్థులకు ఈ టాప్ క్లాస్ స్కాలర్షిప్లు రాకపోవడం శోచనీయమన్నారు. ఓయూ అధికారులు వెంటనే స్పందించి, ఓయూ విద్యార్థులకు ఈ స్కాలర్షిప్లు అందేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులు రవినాయక్, రంజిత్, కరణ్, విజయ్కుమార్, నరేశ్, రవీందర్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.