వానకాలం పంట పుష్కలంగా పండింది. లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలివస్తున్నది. కేంద్రం కొర్రీలు పెడుతున్నప్పటికీ, అన్నదాతను ఆదుకోవాలన్న ఏకైక లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకుంటున్నది. పంట అమ్ముకునుడు ఎట్లనో అని రైతులు రంది పడకుండా ప్రతి గింజనూ కొనుగోలు చేస్తున్నది. జిల్లా రైతాంగం వానకాలం రికార్డు స్థాయిలో వరి సాగు చేయగా,
5 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఆ మేరకు కొనుగోళ్లకు పౌరసరఫరాల శాఖ 279 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు 1,94,956 మెట్రిక్ టన్నుల ధాన్యం తీసుకుని, రూ.102 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా.. కొనుగోళ్లు, మార్కెటింగ్ పరంగా ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 12 చోట్ల నూరుశాతం కొనుగోళ్లు పూర్తి చేసి, కేంద్రాలను సైతం మూసేశారు.
జిల్లాలో నీటిపారుదల పెరగడంతో సాగువిస్తీర్ణంతోపాటు వరి ధాన్యం
దిగుబడులూ పెరిగాయి. రైతులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నది. ఈ ఏడాది వానకాలంలో సాగైన వరి ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేసేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. ఓ వైపు కేంద్రం నుంచి సహాయ నిరాకరణ..మరోవైపు సంక్షోభ పరిస్థితులు ఉన్నా రైతులకు ఇబ్బందులు కలుగకుండా ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ సీఎం కేసీఆర్ భరోసా నింపుతున్నారు.
సజావుగా కొనుగోళ్లు
గత యాసంగిలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించడంలో ఎఫ్సీఐ జాప్యం చేస్తున్నది. ఫలితంగా గోదాములు ఖాళీగా లేక పోవడంతో వానకాలం కొనుగోళ్లపై ప్రభావం పడుతున్నది. అయినా మిల్లర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి ధాన్యం కొనుగోళ్లకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. హమాలీలు, లారీల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. సమస్యలు ఎదురైన చోట్లకు అధికారులు వెళ్లి వాటిని సత్వరమే పరిష్కరిస్తున్నారు. లోడింగ్, అన్లోడింగ్, గన్నీ బ్యాగులు, రైతులకు డబ్బుల చెల్లింపుల్లో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి జిల్లాస్థాయిలో ప్రత్యేక బృందాలను సైతం ఏర్పాటు చేశారు. దాంతో వానకాలం కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. కొనుగోలు చేసిన ధాన్యంలో 1,84,968 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే రైస్ మిల్లులకు తరలించారు.
ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు
వానకాలం ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ప్రతి గింజనూ కొనుగోలు చేస్తుంది. తొందరపడి బయటి మార్కెట్లో విక్రయించి నష్టపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలి. మార్కెటింగ్, డబ్బుల చెల్లింపులు, గన్నీ బ్యాగుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.
279 కేంద్రాలు..
వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు జిల్లాలో 279 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఐకేపీ ఆధ్వర్యంలో 91, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 184 కేంద్రాలను, మరో 4 కేంద్రాలను వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో సరిపడా గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచారు. వర్షం కురిస్తే ధాన్యం తడువకుండా టార్పాలిన్లను ఏర్పాటు చేశారు. దాంతో పాటు కేంద్రాల వద్ద తాగునీరు, నీడ సౌకర్యం కూడా కల్పించారు. ఈ సీజన్లో 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించగా.. ఇప్పటివరకు 24,636 మంది రైతుల నుంచి 1,94,956 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించి రూ.102 కోట్లను రైతులకు చెల్లించారు. ధాన్యం విక్రయించిన వారం రోజుల్లోనే డబ్బులు బ్యాంకు ఖాతాల్లో పడుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.