అమీర్పేట్ : ఎస్ఆర్నగర్ వయోధికుల మండలి ఆధ్వర్యంలో కొనసాగుతున్న సామాజిక సేవలు ఎంతో అమూల్య మైనవని ఎమ్మెల్సీ వాణీదేవి అన్నారు. ఆస్టర్ ఫ్రైమ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఎస్ఆర్నగర్ సీనియర్స్ సిటిజన్ కౌన్సిల్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారితో కలిసి ఆమె ప్రారంభించారు.
ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగిన ఈ వైద్య శిబిరంలో ఉచితంగా నిర్వహించిన ఆర్థోపేడిక్, ఈఎన్టి, న్యూరో, ఫిజియోథెరపి, రక్త, మూత్ర తదితర ల్యాబ్ టెస్టులను మండలి సభ్యులతో పాటు కాలనీ పరిసరాల ప్రజలు చేయించుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వాణీదేవి మాట్లాడుతూ వయోభారంతో ఉంటున్నా సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములవుతూ ఎస్ఆర్నగర్ వయోధికుల మండలి ప్రతినిధులు అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు.
వయోభారం శాపం కాదని రుజువు చేస్తూ నిరంతరం ఆధ్యాత్మిక ప్రవచనాలు, ప్రసంగాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, ఇండోర్ గేమ్స్, యోగా, ఉచిత వైద్య శిబిరాలు వంటి కార్యకలాపాలతో తమను తాము బిజీగా ఉంచుకుంటూనే వృద్ధాప్య మాధుర్యాన్ని తోటి వారితో కలిసి ఆనందిస్తుండడం ఇక్కడి కౌన్సిల్ ఆవరణలో కనిపిస్తుందన్నారు.
వయోధికుల సమస్యలేమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని వాటిని పరిష్కరించేందుకు తన వంతు తోడ్పాటు నందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండలి అధ్యక్షులు కాసాని సహదేవ్గౌడ్, ప్రధాన కార్యదర్శి డి.అనంతరెడ్డి, ప్రతినిధులు జి.యాదగిరి, మాణిక్రావు పటేల్, లింగమయ్య పెరుమాండ్ల తదితరులు పాల్గొన్నారు.