ఖైరతాబాద్ : అన్నార్థులకు అపన్నహస్తం అందిస్తూ….పేదలకు సేవలు చేయడమే పరమావధిగా పనిచేస్తామని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ స్పష్టం చేసింది. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు జెగిని నాగభూషణం, గ్రేటర్ అధ్యక్షులు, టీఆర్ఎస్ నాయకులు ఊర నరసింహాగుప్తాలు మాట్లాడుతూ వరల్డ్ ఆర్య వైశ్య మహాసభ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యుల సంక్షేమానికి పాటుపడుతున్నదన్నారు.
పేదలకు ఆర్థిక చేయూత, నిత్యవసరాల పంపిణీ కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. కొవిడ్ సమయంలోనూ వలస కార్మికులకు ఆహారం, నిత్యవసరాలు అందజేశామని, ఉచిత వైద్య, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. కొవిడ్ రోగుల కోసం ఉచిత అంబులెన్స్, తాజాగా ఫ్రీ వ్యాక్సినేషన్ క్యాంపులు సైతం నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటులో తమ వంతు సహాకారం అందిస్తామన్నారు.
నల్గొండ లైంగిక దాడి, హత్యకు ఖండన
ఇటీవల నల్గొండ జిల్లా ముషపల్లిలో ఆర్యవైశ్య మహిళపై జరిగిన లైంగిక దాడి హత్యను వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులు ఖండించారు. ఈ సందర్భంగా రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం రూ.50లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలన్నారు.
ఇలాంటి ఘటనలో బాధితులైన కుటుంబాలకు ఉచిత న్యాయ సేవ అందించేందుకు 15 రోజుల్లో మహాసభ ఆధ్వర్యంలో ప్రణాళికను రూపొందించి కమిటీ వేస్తామన్నారు. ప్రభుత్వం ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.
ఈ సమావేశంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు చకిలం రమణయ్య, గ్లోబల్ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్, గ్లోబల్, జీహెచ్ఎంసీ కోశాధికారులు ఎల్వీకుమార్, బాబురావు, మారంశెట్టి శ్రీనివాస్, కొండూరి శ్రీనివాస్గుప్తా, న్యాయసలహాదారులు భాను మూర్తి, డాక్టర్ విద్యాసాగర్, గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాచం రాముగుప్త పాల్గొన్నా రు.