ఉప్పునుంతల, జనవరి 2 : బైక్పై వెళ్తున్న ఇద్దరిని వేగంగా వచ్చిన కారు ఢీకొన్న ఘటన నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం ఈరటోనిపల్లి వద్ద శ్రీశైలం-హైదరాబాద్ హైవేపై చోటు చేసుకున్నది. ఎస్సై రమేశ్ కథనం మేరకు..అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామానికి చెందిన చెన్నయ్య(44), బాల్చంద్రయ్య(45) బైక్ (టీఎస్ 08 జీటీ 8491)పై డిండి నుంచి సొంతూరుకు బయలుదేరారు. ఈ క్రమంలో శ్రీశైలం నుంచి హైదరాబాద్కు వేగంగా వెళ్తున్న కారు (ఏపీ 39కే 07993) ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయం తెలియగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను అంబులెన్స్లో అచ్చంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కాగా కారులోని ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నిరుపేద దళిత కుటుంబానికి చెందిన ఇద్దరు మేస్త్రీలు పనులు చేయడానికి వెళ్లి రోడ్డు ప్రమాదానికి గురికావడంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. చెన్నయ్యకు భార్య, కుమారుడు, బాల్చంద్రయ్యకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. దవాఖాన వద్ద కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి. ఈ విషయం తెలియగానే ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు వైద్యశాల వద్దకు వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించారు. రూ.10వేల చొప్పున ఆర్థికసాయం అందజేశారు.