కొండాపూర్ : కొడుకు, కొడలి మధ్య తలెత్తిన వివాదాన్ని సద్దుమణగజేసేందుకు తండ్రి మందలించడంతో అలిగిన కొడుకు ఇళ్లు వదిలివెళ్ళిన సంఘటన చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శేరిలింగంపల్లి పాపిరెడ్డి కాలనీలో కొండయ్య తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు.
ఈ నెల 14న కొండయ్య కొడుకు జీ రాజేష్ (25), ఆయన భార్య మధ్య వివాదం చోటు చేసుకుంది. గొడవను సద్దుమణగజేసేందుకు తండ్రి కొడుకును మందలించడంతో కోపంతో అలిగి సెల్ఫోన్ను ఇంట్లోనే వదిలేసి బయటకు వెళ్ళిపోయాడు.
ఎంతకీ తిరిగిరాకపోవడంతో తెలిసిన వారిని, బంధువులను ఆరాతీసినప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కొండయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.