సికింద్రాబాద్ : స్వగ్రామానికి వెళ్లే క్రమంలో తండ్రి సూచనలమేరకు ఇంటినుంచి బస్టాపుకు బయలుదేరిన ఓ గృహిణి అదృశ్యమైంది. బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం న్యూ బోయిన్పల్లి ఆనందనగర్ కాలనీకి చెందిన రాజేశ్వర్ (59)కు నలుగురు కుమార్తెలు, ఒక్క కుమారుడు పెద్దకుమార్తె డి. లక్ష్మి (36) తన భర్త విద్యాసాగర్, పిల్లలతో కలిసి ఆనందనగర్ కాలనీలోనే నివాసముంటుంది.
గురువారం రాజేశ్వర్, లక్ష్మితో కలిసి తన స్వగ్రామమైన కరీంనగర్ జిల్లా మెట్పల్లికి వెళ్లాలనుకున్నాడు. ఉదయం పనిమీద జేఎన్టీయూకు వెళ్లిన రాజేశ్వర్, లక్ష్మికి ఫోన్ చేసి 11:30 గంటలవరకు బోయిన్పల్లి బస్టాపు వద్దకు రావాలని సూచించాడు. ఈమేరకు లక్ష్మి 11గంటల ప్రాంతంలో ఇంటినుంచి బయలుదేరింది.
మార్గమధ్యలోని చిన్నతోకట్టవద్ద తన చెల్లెలిని కలిసింది. అక్కడినుంచి బస్టాపుకని బయలుదేరింది. కానీ, రాజేశ్వర్ బస్టాపువద్దకు చేరుకునేసరికి లక్ష్మి అక్కడ కనిపించలేదు. ఆమె ఫోన్ కూడా అందుబాటులోకి రాకపోవడంతో బంధువు లు, తెలిసిన వారిని ఆరా తీసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. రాజేశ్వర్ ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.