మణికొండ : నగర శివారు ప్రాంతాల ప్రజలకు శాశ్వతంగా తాగునీటి సమస్యలను పరిష్కరించడమే రాష్ట్ర సర్కారు ప్రధాన ధ్యేయమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి పేర్కొన్నారు.
రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని మణికొండ అల్కాపూర్టౌన్షిఫ్కాలనీలో ఇంటింటికి తాగునీటిని అందించే పథకంలో భాగంగా రూ.1200 కోట్ల నిధులతో నిర్మించనున్న అవుటర్ రింగ్రోడ్డు తాగునీటి సరఫరా ఫేస్-2 ప్రాజెక్టు పనులలో భాగంగా సోమవారం రూ.587 కోట్ల నిధులతో శంఖుస్థాపన పనుల ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అన్నివర్గాల సంక్షేమంతో పాటు అభివృద్ది పనులకు పెద్దపీట వేస్తోందన్నారు. నగర శివారు ప్రాంతాల అభివృద్ది విషయంలో రాష్ట్ర పట్టణాభివృద్ది, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టిసారించారని అన్నారు.
మంత్రి చొరవతో ఇప్పటికే శివారు మున్సిపాలిటీలు, గ్రామాలకు కోట్లాది నిధులను కేటాయించి మహానగరంతో సరిసమా నంగా నిధులను కేటాయిస్తున్నారని తెలిపారు. శివారు ప్రాంతాల ప్రజలకు శాశ్వతంగా తాగునీటి సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా ప్రతిపాదనలను రూపకల్పన చేస్తున్నారని అందులో భాగంగా అవుటర్ రింగ్రోడ్డు లోపలి మున్సిపాలిటీ గ్రామాలకు మంచినీటిని అందించేందుకు రూ.1200కోట్లను ప్రతిపాదనలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు.
రూ.1200 కోట్ల నిధులతో రాజేంద్రనగర్ నియోజకవర్గానికి రూ.200 కోట్ల నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా నార్సింగి దగ్గర అవుటర్ రింగురోడ్డు నుంచి దిగేందుకు,ఎక్కేందుకు పాసింగ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్న మంత్రి కేటీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
గతంలో వేసవికాలం వచ్చిందంటే చాలు గంటల తరబడి విద్యుత్ కోతలుండేవని స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత కోతలు లేకుండా నిరంతరం విద్యుత్ను అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. పెరుగుతున్న జనాభాకు అను గుణంగా ఎప్పటికప్పుడు చర్యలు మౌలికసదుపాయాల కల్పనతో పాటు అభివృద్ది పనుల కోసం రూపకల్పన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి అన్నారు.
ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వాలన్న కళలను సాకారం చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని చేవెళ్ల పార్లమెంటు సభ్యులు గడ్డం రంజిత్రెడ్డి అన్నారు. ఇంటింటికి నీళ్లందించడమే ప్రధాన లక్ష్యంగా మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ ధైర్యంగా నిర్ణయం తీసుకుని రాజేంద్రనగర్ నియోజకవర్గానికి రూ.200 కోట్ల నిధులను కేటాయించడం సంతోషంగా ఉందన్నారు.
భవిష్యత్తులో నాలుగు నియోజకవర్గాలకు శాశ్వతంగా తాగునీటి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పి.మహేందర్రెడ్డి, సురబి వాణిదేవి, స్థానిక ఎమ్మెల్యే టి.ప్రకాష్గౌడ్, జెడ్పీచైర్పర్సన్ తీగల అనితారెడ్డి, జలమండలి ఎండీ దానకిషోర్, మణికొండ మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్ ముదిరాజ్, వైస్ చైర్మన్ కె.నరేందర్రెడ్డి,జలమండలి అధికారులు రవీందర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి,కౌన్సిలర్ రామకృష్ణారెడ్డి,కావ్యశ్రీరాములు,వసంత్హాన్, లావణ్యనరేష్, లక్ష్మీనారాయణ శ్రీకాంత్స్వామి,మాజీ ఎంపీపీ మల్లేష్,మణికొండ మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బి.శ్రీరాములు, వివిధకాలనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.