సైదాబాద్ : అఘాయిత్యంతో పాటు దారుణ హత్యకు గురైన ఆరేండ్ల చిన్నారి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. సోమవారం సింగరేణికాలనీకి విచ్చేసి బాధిత కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చి మనోధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి అన్ని విధాలుగా న్యాయం చేస్తుందని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. ఇటువంటి సంఘటన జరగటం బాధకారమని, ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేసిందన్నారు.
సింగరేణికాలనీ సందర్శించిన విపక్ష నేతలు…
సింగరేణికాలనీలోని బాధిత కుటుంబాన్ని విపక్ష పార్టీల నేతలు కలిసి కుటుంబ సభ్యులను పరామర్శించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, బెల్లయ్య నాయక్, ఇందిరా శోభన్, మాజీ రాజ్యసభ సభ్యుడు అజీజ్పాష, సీపీఐ పార్టీ నాయకులు ఈటీ నర్సింహా, శంకర్ నాయక్, బీఎస్పీ నాయకులు ఆర్.ఎస్ ప్రవీణ్కుమార్, సీపీఎం, సీపీఐ పార్టీలకు చెందిన నాయకులు బాధిత కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు.