శంషాబాద్ : ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా తల్లీబిడ్డల సంరక్షణకు ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తెలిపారు. గురువారం సిరి స్వచ్ఛంద సంస్థ , ఐసీడీఎస్ సంయుక్తంగా స్థానిక వైఎన్ఆర్ గార్డెన్ లో నిర్వహించిన అంగన్వాడి పిల్లలకు బాలామృతం, అక్షరాభ్యాసం, గర్భిణీలకు సామూహిక సీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. పౌష్టికాహారం పై అవగాహన కల్పించే వివిధ తినుపదార్థాల ప్రదర్శనను తిలకించారు.
ఈ సందర్భంగా ప్రకాశ్గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రసవ మరణాలు లేకుండా భావితరం ఆరోగ్యంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్షని తెలిపారు. నిరుపేద కుటుంబాల పేద బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించేందుకు ఆరోగ్య లక్ష్మి, నవజాత శిశువుల కోసం అమ్మ ఒడి వంటి పథకాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిరి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు రమాదేవి, మున్సిపల్ చైర్పర్సన్ సుష్మారెడ్డి, జడ్పీ ఫ్లోర్ లీడర్ తన్వి, ఎంపిపి జయమ్మ, నార్సింగి మార్కెట్ కమిటి చైర్మన్ వెంకటేశ్, కమీషనర్ సాబేరలి, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.