బడంగ్పేట : ప్రతి కాలనీకి మంచి నీటి పైపులైన్లు వేయించాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన సూచనల మేరకు పైపులైన్ పనులు వేగ వంతం చేశామని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 6,7,8,9 డివిజన్లలో రూ.2.77 కోట్లతో రోడ్లు, డ్రైనేజీ, మంచి నీటి పైపులైన్ పనులకు మేయర్ చిగిరింత పారిజాత నర్సింహరెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్ తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఇంటికి మంచి నీటి సరఫరా చేయడానికి పైపులైన్లు, రిజర్వాయర్లు నిర్మాణం చేయిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. శివారు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రతి కాలనీకి మంచి నీటి సరఫరా చేయడానికి ప్రభుత్వం శక్తి వంచన లేని కృషి చేస్తుందన్నారు.
కాలనీలలో ఉన్న ప్రజల మౌలిక సమస్యలను దశల వారిగా పరిష్కరిస్తున్నామని ఆమె తెలిపారు. శంకుస్థాపన చేసిన పనులను వేగ వంతంగా పూర్తి చేయాలన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి పనులు చేయించాలన్నారు.
నిరుద్యోగుల కళను నెరవేర్చడానికి ముఖ్య మంత్రి కేసీఆర్ దశల వారిగా నోటిఫికేషన్ ..
రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి 80వేల ఉద్యోగాలకు ప్రకటించారని, ఇప్పటికే గ్రూప్ 1, పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారిచేయడం జరిగిందన్నారు. దశల వారిగా 80వేల పోస్టులకు నోటిఫికేషన్ వస్తుందన్నారు. పేద విద్యార్థులు డబ్బులు పెట్టి కోచింగ్ తీసుకోలేని వారి కోసం ఉచిత కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయిస్తామని ఆమె అన్నారు.
మహేశ్వరం, కందుకూరు విద్యార్థుల కోసం తుక్కుగూడలో ఉచిత కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతు న్నామని ఆమె వివరించారు. బడంగ్పేట, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న విద్యార్థుల కోసం ఉచిత కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయిస్తామన్నారు. ఉచిత శిక్షణ తీసుకోవాలనుకున్న వారు మున్సిపల్ కార్పొరేషన్లలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలని ఆమె సూచించారు.
మేయర్లు, కార్పొరేటర్లు బాధ్యత తీసుకొని కోచింగ్ తీసుకునే వారి జాబితాను తయారు చేయాలన్నారు. వారం రోజులలోపు కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయిస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ కృష్ణ మోహన్ రెడ్డి, డిఇఇ అశోక్ రెడ్డి, కార్పొరేటర్లు ఇంద్రసేనా, నిమ్మల సునిత శ్రీకాంత్ గౌడ్, శ్రీధర్ రెడ్డి, గడ్డం లకా్ష్మారెడ్డి, శంకర్, సూర్ణ గంటి అర్జున్, కోఆప్షన్ సభ్యులు సమఖ్య జ్యోతి అశోక్, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు.