బన్సీలాల్పేట్ : పేదలందరికీ నాణ్యమైన విద్య అందించాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని, విద్య ఒక్కటే పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును అందిస్తుందని శాసన మండలి సభ్యురాలు ఎస్.వాణిదేవి అన్నారు. బన్సీలాల్పేట్ డివిజన్, భోలక్పూర్లోని మేకలమండి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు అదనపు తరగతి గదుల నిర్మాణానికి నిధులను కేటాయించాలని కార్పొరేటర్ కే.హేమలత గురువారం వాణిదేవిని కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సిఫారసు చేసిన లేఖను ఆమెకు అందించారు.
ఈ సందర్భంగా వాణిదేవి మాట్లాడుతూ గత 40 ఏండ్లుగా తాను విద్యారంగంలో ఉన్నానని, తన తండ్రి పీవీ. నర్సింహా రావు ఆశీస్సులు, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహం, ప్రజల మద్దతుతో ఎమ్మెల్సీగా గెలిచిన తాను విద్యావ్యవస్థ బలోపేతా నికి కృషి చేస్తానని అన్నారు. పాఠశాల హెచ్ఎం. కే.మల్లికార్జున్రెడ్డి మాట్లాడుతూ మంత్రి తలసాని సహకారంతో తమ ప్రాథమిక పాఠశాల ఇప్పుడు యూపీఎస్ గా మారిందని, ప్రస్తుతం 750 మంది విద్యార్థులు చదువుతున్నారని అన్నారు.
మంచి విద్య అందించడం ద్వారా అడ్మిషన్లు పెరిగాయని, వారికి సరిపడేలా తరగతి గదులను పెంచాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. కార్పొరేటర్ హేమలత మాట్లాడుతూ మంత్రి తలసాని ఆదేశాలతో ఇటీవల తమ డివిజన్లో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి, అక్కడ నెలకొని ఉన్న సమస్యలను తెలుసుకుని, వాటిని నివేదిక రూపంలో మంత్రికి అందజేశామని తెలిపారు.
తమ ప్రాంతంలో ఉన్న పేద ప్రజలు చదువుకుంటున్న ఈ పాఠశాల అభివృద్ధి కోసం స్థానిక జర్నలిస్టులందరూ మద్దతుగా నిలిచారని హైదరాబాద్ జిల్లా హెచ్యూజే అధ్యక్షుడు ఈ.చంద్రశేఖర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు బి.నర్సింగ్ రావు, టీఆర్ఎస్ నాయకులు కే.లక్ష్మిపతి, కమల్కుమార్, ప్రేమ్కుమార్, ఫహీమ్, అబ్బాస్, మురళి పాల్గొన్నారు.