నిజాంసాగర్/ పిట్లం/ మద్నూర్/బిచ్కుంద, జనవరి 2 : జిల్లాలోని పలు గ్రామాల్లో రైతులు ఎలమాస పండుగను ఆదివారం ఘనంగా నిర్వహించుకున్నారు. పండుగ సందర్భంగా రైతు కుటుంబాలు పోలెలు, రకరకాల కూరగాయలు, పప్పులతో ప్రత్యేక వంటకాలను చేశారు. ఉదయాన్నే కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో పొలాల్లోకి వెళ్లారు. పొలాల్లో భూదేవి అమ్మవారికి పాలు పొంగించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు. పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుతూ ప్రతి ఏడాది ఎలమాస పండుగను నిర్వహిస్తామని రైతులు తెలిపారు.
జుక్కల్ మండలకేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో ఎలమాస పండుగను జరుపుకొన్నారు. ఉదయాన్నే పొలాల్లోకి వెళ్లిన రైతన్నలు.. ఉదయం నుంచి సాయంత్రం వరకు సంతోషంగా గడిపారు. జుక్కల్ ప్రాంతంలో ఎలమాస పండుగను రైతన్నలు ప్రతి ఏడాదిలాగే ఘనంగా నిర్వహించారు.
పిట్లం మండలంలోని ధర్మారం, కంభాపూర్, కారేగాం, గోద్మేగాం, అల్లాపూర్ గ్రామాల్లో ఎలమాస పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు కుటుంబీకులతో కలిసి పొలాల్లోకి వెళ్లి వ్యవసాయ పనిముట్లకు పూజలు చేశారు. పొలాల్లో నైవేద్యాలు సమర్పించి వనభోజనాలు చేశారు.
మద్నూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఎలమాస సందర్భంగా పొలాల్లో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేశారు. పంటలు బాగా పండాలని అమ్మవారికి మొక్కుకున్నారు.