శంషాబాద్ రూరల్ : పూలను పూజించే అరుదైన సంస్కృతి కేవలం తెలంగాణ రాష్ట్రానికి దక్కుతుందని రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు. మంగళవారం శంషాబాద్ జడ్పీటీసీ నీరటి తన్విరాజు ఆధ్వర్యంలో నర్కూడ గ్రామంలోని అమ్మపల్లి దేవాలయం వద్ద బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.
వేడుకలకు ముఖ్యఅతిథిలుగా జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిపాడారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పూలను పూజించే సంస్కృతి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఆంధ్రపాలనలో కనుమరుగైన బతుకమ్మ వేడుకలు ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్సి కవితల ఆధ్వర్యంలో ప్రపంచదేశాలకు విస్తరించిందని తెలిపారు.
ప్రపంచదేశాల్లో ఎక్కడ లేని బతుకమ్మ ఆట కేవలం తెలంగాణ రాష్ట్రానికే తలమానికమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జయమ్మశ్రీనివాస్, వైస్ ఎంపీపీ నీలం నాయక్,టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు చంద్రారెడ్డి, నీరటి రాజు ముదిరాజ్ పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.