కాచిగూడ : బీసీల మనో భావాలను గ్రహించి సీఎం కేసీఆర్ మరోసారి అసెంబ్లీలో కులగణన తీర్మాణం చేసి కేంద్రానికి పంపించి తన నిజాయితిని నిరుపించుకున్నాడని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు.
వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం జనగణనలో కుల గణన చేపట్టాలని, కులగణన చేయాలని కేంద్ర ప్రభు త్వంపై ఒత్తిడి పెంచడానికి లక్షలాది మందితో జాతీయ స్థాయిలో ఉద్యమం చేస్తామన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం కాచిగూడలోని అభినందన్ హోటల్లో 65 బీసీ సంఘాలతో సమావేశాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఆర్.కృష్ణయ్య హాజరై మాట్లాడుతూ దేశ ప్రధాని బీసీగా ఉండి బీసీలకే తీవ్ర అన్యాయం చేస్తున్నాడని, ప్రధానికి కులగణన చిన్న అంశమని ఆయన పేర్కొన్నారు.ఇది బీసీల వ్యతిరేక చర్య అని, బీజేపీలో బీసీ నాయకులందరూ కేంద్రంపై ఒత్తిడి చేసి, కులగణన చేసే విధంగా ప్రధానిపై అధిక ఒత్తిడి తేవాలని ఆయన సూచించారు.
పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.సీఎం కేసీఆర్ బీసీ బంధు పథకం ప్రకటించి, వెంటనే అమలు చేయడానికి చర్యలే తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కులగణన కోసం దేశంలోని బీసీలందరు కేంద్రం మెడలు వంచే రోజు దగ్గరలోనే ఉందని ఆయన హెచ్చరించారు.
కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఏడు రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మాణం చేసినట్లు ఆయన గుర్తుజేశారు. జనగణలో కులగణన చేయడం బీసీల ప్రధాన డిమాండ్ అని, మోదీ ప్రభుత్వం కులగణన చేయడం సాధ్యంకాదని అఫిడేవిట్ ఫైల్ చేయడం పిరికిపంద చర్యకు నిదర్శనమని ఆయన ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో గుజ్జ కృష్ణ, కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఓబీసీ ఉద్యోగుల అధ్యక్షుడు దానకర్ణాచారి,లాల్ కృష్ణ, ఫోరమ్ ఫర్ సోషల్ జస్టిస్ కన్వీనర్ జి.శారధగౌడ్, నీల వెంకటేశ్, రాజేందర్, ఉదయ్, జయంతి, జగదీశ్, అనంతయ్య,చంటి,బాలకుమాతో పాటు 65 బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.