సికింద్రాబాద్ : కంటోన్మెంట్ బోర్డు ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జీరో ఆవర్లో ప్రస్తావించారు. రక్షణ శాఖ అధీనంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతం ఉండడంతో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు లభించడం లేదన్నారు. నగరం నడిబొడ్డున ఉన్నా, చుట్టూ మల్కాజి గిరి, అల్వాల్, కూకట్పల్లి ప్రాంతాలు ఉన్నా సరైన వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
ముఖ్యంగా 1999లోనే జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ను విలీనం చేయాలనే ప్రతిపాదనలో కదలిక వచ్చిందని, ప్రస్తుతం మరోసారి ప్రజల్లో విలీనం చేయాలనే వినతులు వస్తున్నాయని చెప్పారు. కంటోన్మెంట్ బోర్డుకు నెలనెలా రక్షణ శాఖ నుంచి రావాల్సిన సర్వీస్ చార్జీలు రాకపోవడంతో సుమారు రూ.650 కోట్లు పెండింగ్లో ఉన్నాయని, దీంతో అభివృద్ధి పనులు జరగక, ఆ ప్రాంతం అంతా కుంటుపడుతుందన్నారు.
కంటోన్మెంట్ నియోజకవర్గం 70 శాతం బోర్డు పరిధిలో ఉండగా, మిగతా 30 శాతం జీహెచ్ఎంసీ పరిధిలో ఉంది. జీహెచ్ఎంసీలో పరిధిలో ఉన్న ప్రజలకు అన్ని సౌకర్యాలు లభిస్తుండగా, బోర్డు పరిధిలో మాత్రం అలా జరగడం లేదన్నారు. ఆదే విధంగా సొంత స్థలం ఉండి భవనం కట్టుకోవాలన్నా ఎన్నో అంక్షలు ఉన్నాయని చెప్పారు. ఇన్ని ఇబ్బందులతో జనం సతమతం అవుతున్నారని, దేశంలోని 62 కంటోన్మెంట్లలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అతిపెద్దదని, ఇక్కడి ప్రజల కోరిక మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి, జీహెచ్ఎంసీలో విలీనం అయ్యే విధంగా చొరవ తీసుకోవాలని విన్నవిస్తున్నట్లు తెలిపారు.
ఇటీవలే రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో విలీనం అంశంపై ప్రస్తావన తీసుకురావడంతో మరోసారి కదలిక వచ్చిందన్నారు. విలీనం అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ రక్షణ శాఖ మంత్రితో పాటు ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యకు పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు.