నారాయణపేటరూరల్, డిసెంబర్ 28: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. మండలంలోని సింగారం, కోటకొండ, చిన్నజట్రం, కొల్లంపల్లి గ్రామాల్లో రూ.22 లక్షలతో నిర్మించిన రైతు వేదిక భవనాలను మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాక ముందు ఎరువులు, విత్తనాల కోసం రైతులు పోలీస్స్టేషన్, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో లైన్లో చెప్పులు పెట్టి నిరీక్షించిన పరిస్థితి ఉండేదన్నారు. ప్రస్తుతం కేసీఆర్ ప్రభుత్వం రైతులకు సమస్యలు లేకుండా 24గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు కూడా ఇస్తున్నారని గుర్తుచేశారు. 5వేల ఎకరాలకు ఒక క్లస్టర్ రైతు వేదికను నిర్మించి రైతులకు అవగాహన కార్యక్రమం చేపడుతుందన్నారు. ఆయా వేదికల్లో సీడీపీ నిధులతో కంప్యూటర్, ప్రొజెక్టర్, ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయమని చెబుతుంటే రాష్ట్ర నాయకులు వరి వేయమని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి యాసంగిలో ఇతర పంటలైన కుసుమలు, పెసర్లు, నువ్వులు, వేరుశనగ, ఆయిల్పాం, కూరగాయల తోటలు, పందిరి కూరగాయల తోటలతో పాటు లాభాలు వచ్చే పంటలను పండించాలన్నారు. కోటకొండ గ్రామంలో రూ.14.15 లక్షల జెడ్పీ నిధులతో పీహెచ్సీకి ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కోటకొండ గ్రామంలో పలు అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించాలని సర్పంచ్ విజయలక్ష్మి ఎమ్మెల్యేను కోరగా రూ.9లక్షల సీడీపీ నిధులు మంజూరు చేస్తామన్నారు.
డీలర్ల దేశీ కోర్సు ప్రారంభం
మండలంలోని జాజాపూర్ గ్రామంలో డీలర్లకు ఏర్పాటు చేసిన దేశీ శిక్షణను (డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఫర్ ఇన్పుట్ డీలర్స్) ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శిక్షణను డీలర్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులకు పంటలపై అవగాహన కల్పించే విధంగా శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణ ముగిశాక పరీక్ష నిర్వహించి సర్టిఫికెట్లు అందజేస్తారన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్రెడ్డి, జెడ్పీటీసీ అంజలి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు వెంకట్రాములు గౌడ్, సర్పంచులు జయంతిశ్రీనివాస్రెడ్డి, విజయలక్ష్మీరాము, రాములు, సాయిరెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ నర్సింహారెడ్డి, వైస్ ఎంపీపీ సుగుణ, జెడ్పీ కోఆప్షన్ తాజుద్దీన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కన్నా జగదీశ్, ఏవో నాగరాజ్, ఏఈవోలు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, జిల్లా సభ్యులు వేపూరి రాములు, రైతుబంధు జిల్లా సభ్యుడు కోట్ల జగన్మోహన్రెడ్డి, పట్టణాధ్యక్షుడు విజయ్సాగర్, మండల కార్యదర్శి రవీందర్గౌడ్ పాల్గొన్నారు.