వనస్థలిపురం : తమకు మూడవ కాన్పులోనూ ఆడబిడ్డే పుట్టిందని ఓ దంపతులు మూడురోజుల పసి బిడ్డను రూ.80వేలకు విక్రయించారు. ఈ దారుణం వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి వివరాల ప్రకారం. వనస్థలిపురంలో నివాసముండే దుర్గప్రియ, శ్రీనివాస్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.
జనవరి 21న మూడవ కాన్పులో మరో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అప్పటికే ఇద్దరు ఆడబిడ్డలున్న దంపతులు కుమారుడు పుడతాడని గంపెడాశతో ఉన్నారు. మరోసారి ఆడబిడ్డ పుట్టడంతో నిరాశకు లోనయ్యారు. ముగ్గురిని పెంచడం తమకు సాధ్యం కాదని భావించారు. ఆశావర్కర్గా పనిచేస్తున్న భాషమ్మకు విషయం చెప్పారు.
దీంతో ఆమె బాలాపూర్లో నివాసముండే కవిత అనే మహిళతో రూ.80వేలకు బేరం కుదిర్చి విక్రయించింది. కాన్పు సమయంలో దుర్గప్రియతోనే ఉన్న ఆమె తల్లి రాజేశ్వరి దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యాక సొంత ఊరికి వెళ్లింది. కొన్ని రోజుల తర్వాత కూతురు, అల్లుడికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం లేదు. దీంతో నగరానికి వచ్చిన ఆమెకు ఇంట్లో పసిబిడ్డ కనిపించలేదు.
కూతురు, అల్లుడిని నిలదీయడంతో విక్రయించిన విషయాన్ని వెళ్లడించారు. ఆగ్రహం వ్యక్తం చేసిన రాజేశ్వరి ఆదివారం వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరిపారు.
సోమవారం దుర్గప్రియ, శ్రీనివాస్, ఆశా వర్కర్ భాషమ్మ, కొనుగోలు చేసిన కవితలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పసిపాపను మహిళా శిశు సంక్షేమ శాక హోమ్కు తరలించారు. రికవరి చేసిన రూ.80వేలను కోర్టుకు జప్తు చేశారు.