భూమికి హాని చేయకుండా మేలైన పద్ధతుల్లో సాగు చేపట్టి ఆరోగ్యవంతమైన పంటలను అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు సిరిపురం గ్రామరైతు వాసికర్ల శేషుకుమార్. వరికి బదులు ఇతర పంటలను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్నాడు. ఎకరంన్నర విస్తీర్ణంలో కూరగాయల సాగుతో పాటు పలు రకాల పండ్ల మొక్కలు పెంచుతున్నాడు. రోజూ సుమారు రూ.1500 నుంచి 2,000 వరకు సంపాదిస్తున్నాడు. తనకు 20 ఎకరాల భూమి ఉన్నా ఎకరంన్నరలో సమీకృత సేద్యం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
పండిస్తున్న పంటలివే…
ఎకరంన్నర భూమిలో ఆకు కూరలు, కూరగాయలతో పాటు 50 రకాల పండ్ల మొక్కలు నాటించాడు. వీటిలో జామ, పనస, బత్తాయి, నిమ్మ, అరటి, బిర్యానీ ఆకు, ఎర్ర చింత, డ్రాగన్ ఫ్రూట్, రెడ్ ఆపిల్, గ్రీన్ ఆపిల్, కొబ్బరితోపాటు 14 రకాల మామిడి మల్లిక, ఆల్ఫాన్సా, సువర్ణ రేఖ లాంటి మామిడి మొక్కలను, రాయల్ పనస, నిమ్మ పెంచుతున్నారు. అలాగే బీర, కాకర, టమాట, మిర్చి, సొర, క్యాబేజీ, వంగ, పాలకూర, మెంతికూర, గోంగూర, తోటకూర, బంతి, గులాబీ, మల్లె, చామంతి సాగు చేశాడు. పూలు, పండ్లు కావాలనుకునే వారు నేరుగా వచ్చి కొనుగోలు చేస్తున్నారని రైతు శేషుకుమార్ తెలిపాడు. కూరగాయలు, ఆకుకూరలతో పాటు పండ్ల విక్రయంతో రోజూ రూ.1500 నుంచి 2,000 వరకు ఆదాయం వస్తుందని వెల్లడించాడు. నాటు కోడి గుడ్లను ఇంక్విబేటర్లో పొదిగించి పిల్లల్ని పెంచి అమ్ముతున్నట్లు తెలిపాడు.
సమీకృత వ్యవసాయంతో అధిక లాభాలు…
సమీకృత వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించడంలో భాగంగానే కొన్నేండ్లుగా ఎకరంన్నర పొలంలో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తున్నాను. ఇప్పటికే చాలా మంది వ్యవసాయ క్షేత్రానికి వచ్చి సమీకృత వ్యవసాయం గురించి అడిగి తెలుసుకుంటున్నారు. దీంతో కూలీల ఖర్చు తగ్గడంతో పాటు రైతులకు లాభాలు వస్తాయి. చీడపీడల సమస్య ఉండదు. కూలీల ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. రైతులు పంట మార్పిడి పాటిస్తే లాభాలు సాధించవచ్చు.