ముషీరాబాద్ : తెలంగాణ రైతాంగం పండించిన వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రేటర్ టీఆర్ఎస్ పార్టీ శుక్రవారం ఇందిరా పార్కు వద్ద చేపట్టిన ధర్నా విజయవంతమైంది. నగర్ మంత్రులు మహ్మద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు ఎమ్మెల్యేలు, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, పలువురు పార్టీ సీనియర్లు, వేలాది మంది కార్యకర్తలు పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు. రైతు ధర్నాలో నగరానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు రైతుల పట్ల కేంద్ర వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. రైతులను బేషరతుగా ఆదుకోవడానికి కేంద్రం ముందుకురావాలని డిమాండ్ చేశారు.
రైతుల నడ్డివిరుస్తున్న కేంద్రం..-ముఠా గోపాల్, ఎమ్మెల్యే ముషీరాబాద్
తెలంగాణ ప్రభుత్వం రైతు సమస్యలను పరిష్కరించి నీళ్లు, ఉచిత విద్యుత్, పంట పెట్టుబడి పథకాలతో రైతులను ఆదుకుంటుంటే కేంద్రం రైతుల నడ్డివిరిచే చర్యలకు పాల్పడుతుంది. ఏడేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ సమస్యశామలమైంది. రైతులు చక్కటి పంటలు పండిస్తుంటే కేంద్రం పండించిన వరి ధన్యాన్ని కొనకుండా రాజకీయ చర్యలతో రైతులను గందరగోళానికి గురిచేస్తుంది. టీఆర్ఎస్ను ఎదుర్కొనే దమ్ములేక రాజకీయ లబ్ది కోసం తెలంగాణ రైతుల ఇబ్బందిపెడుతుంది.
కేంద్ర వైఖరి తెలంగాణకు శాపంగా మారుతుంది… -బేతి శుభాష్రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతాంగం పాలిట శాపంగా మారుతుంది. మెరుగైన పంటలు పండించే స్థాయికి చేరుకున్న రైతాంగానికి సాయం చేయాల్సిందిపోయి రైతులను గందరగోళానికి గురిచేస్తొంది. బీజేపీ నేతలకు చేతనైతే, రైతుల పట్ల ప్రేమ ఉంటే గల్లీలో కాకుండా ఢిల్లీలో కొట్లాడి రైతులకు మేలు చేయాలి.
రైతును వేధిస్తున్న కేంద్రం.. -సుధీర్రెడ్డి, ఎమ్మెల్యే ఎల్బీనగర్
నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ రైతులను గందరగోళానికి గురిచేస్తూ వేధిస్తుంది. రాజకీయ లబ్దికోసం బీజేపీ నాయకులు ముఖ్యమంత్రి పట్ల సంస్కార హీనంగా మాట్లాడుతున్నారు. వరిపండించాలని రైతులను రెచ్చగొడుతూ సిఎం మొడలు వంచుతామంటూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. రైతుల పక్షాన ప్రజలంతా ఒక్కటై కేంద్రం మొడలు వంచాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉంది.
అబద్దాల బండి సంజయ్.. – మాగంటి గోపినాథ్, ఎమ్మెల్యే జూబ్లీహిల్స్
పూటకో మాట, నోరు తెరిస్తే అబద్దం అన్నట్లుగా ఉంది బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యవహారం. రాష్ట్రానికి సైసా పని చేయని బండి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది. కేంద్రం పంజాబ్ రైతులను ఒకలా తెలంగాణ రైతులను మరోక చూస్తున్నా బీజేపీ నేతలు మాత్రం సిగ్గులేకుండా అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ రైతుల వడ్లు కొనే వరకు పోరాటం ఆగదు. బీజేపీ నేతలను అడుగడుగునా ఎండగడతాం.
రైతులను వేధిస్తే టీఆర్ఎస్ ఊరుకోదు.. -అరికపూడి గాంధీ, ఎమ్మెల్యే శేరిలింగంపల్లి
దేశాన్ని అన్నం పెడుతున్న రైతులను వేధిస్తే టీఆర్ఎస్ పార్టీ చూస్తు ఊరుకోబోదు. సీఎం కేసీఆర్ రైతు సంక్షేమ చర్యలతో అనతికాలంలోనే గణనీయమైన పంటదిగుబడి పెంచుకొని దేశానికి ఆదర్శంగా నిలిచి తెలంగాణ పట్ల కేంద్రం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుంది. కొందరు బీజేపీ నేతలు రాష్ట్రానికి, రైతులకు ఏమి చేయ చేతకాక ఊరకుక్కల్లా మొరుగుతున్న వారికి తగిన బుద్ది చెప్పాలి. ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు టీఆర్ఎస్ పోరాడుతుంది.
వరిధాన్యం కొంటామని హమీ ఇప్పించండి..-దానం నాగేందర్, ఎమ్మెల్యే ఖైరతాబాద్
సోషల్ మీడియా లీడర్లు బండి సంజయ్, అరవింద్లు అబద్దాలు ప్రచారం చేస్తూ రాజకీయ పబ్బం గడుపుతున్నారు. బీజేపీ నేతలు కబారు రాజకీయాలు మాని చేతనైతే కేంద్రంచే వరి ధాన్యం కొంటామని హామీ ఇప్పించాలి. అట్లా కాకుండా రాజకీయాల కోసం సీఎం పట్ల అమర్యాదగా మాట్లాడితే వీధుల్లో తిరగనివ్వం తరిమి తరిమికొడతాం. సీఎం కేసీఆర్ రైతుల కోసం ఉచిత కరెంటు, నీళ్లు, పెట్టుబడి, భీమా వంటి సౌకర్యాలతో వ్యవసాయాన్ని సస్యశామలం చేస్తే మోడీ ప్రభుత్వం సహకరించకుండా రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతుంది. అన్నం పెట్టే రైతును వేధిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగలకతప్పదు.
నలుగురు ఎంపిలు ఉన్నరు తెలంగాణకు ఎం తెచ్చిండ్రు.. -కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్యే అంబర్పేట్
రాష్ట్రం నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి ఒరిగింది ఏమిలేదు. రాష్ట్రానికి ఒక్క రూపాయి అదనపు సహాయం తీసుకురాకపోగా విభజన హామీల ఊసెత్తడం లేదు. గిరిజన యూనివర్శిటీ, ఉక్కు ప్యాక్టరీ, కోచ్ప్యాక్టరీ వంటి ప్రధాన హామీలను గాలికొదిలేసి రైతులను రెచ్చగొట్టే చర్యలు మొదలు పెట్టిండ్రు. సీఎం కేసీఆర్ రైతు సంక్షేమ పథకాలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తుంటే బీజేపీ నేతలు ఒర్వలేక రైతులను రెచ్చగొడుతున్నరు. రైతుల పట్ల ప్రేమ ఉంటే యాసంగి వడ్లు కొంటామని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి హామీ ఇప్పించాలి. ఎంపి అరవింద్ జుగుత్సాకరంగా మాట్లుడుతున్న తీరు సిగ్గుచేటు.