ఈయన పేరు నగేశ్. నల్లగొండ జిల్లా కురంపల్లి గ్రామం. ఇక్కడి నగేశ్ నవ్వుల వెనుక సర్కారు దవాఖాన సంకల్పం దాగి ఉంది. జీవం జరిగిపోతుందనుకునే క్షణాన.. నల్లగొండ జిల్లా జనరల్ ఆస్పత్రి ఈయనకు పునర్జన్మను ప్రసాదించింది. క్షణికావేశంలో పురుగు మందు తాగి.. ప్రాణాపాయస్థితిలో వస్తే.. అక్కున చేర్చుకుని నిండు ప్రాణం నిలిపింది. 26 రోజులు ఐసీయూలో ఉంచింది. నాణ్యమైన మందులు ఇచ్చింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తితే శస్త్రచికిత్స చేసింది. ప్రైవేటులో అయితే నిర్ణీత ధరల ప్రకారం చూసినా 6లక్షలకు పైగా ఖర్చయ్యే వైద్యాన్ని పైసా తీసుకోకుండా అందించింది. నగేశ్ను బతికించి ఆ కుటుంబంలో వెలుగులు ప్రసాదించింది. సర్కారు వైద్యంపై మరింత భరోసాను నింపింది.పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఆ యవకుడు మరణం అంచులదాకా వెళ్లాడు. ప్రాణాలకు గ్యారంటీ లేకున్నా.. సర్కారు దవాఖాన అతడిని అక్కున చేర్చుకున్నది. కేసును సవాలుగా తీసుకున్న వైద్యులు 26రోజుల పాటు శ్రమించి నిండు ప్రాణం నిలబెట్టారు. ప్రైవేటు దవాఖానల్లో లక్షలాది రూపాయలు ఖర్చయ్యే వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందించి వెలకట్టలేని ప్రాణాలను తిరిగి అందించారు. సదరు యువకుడు నగేశ్ శనివారం డిశ్చార్జ్ అవుతూ ‘మా అమ్మ నాకు జన్మనిస్తే.. సర్కారు దవాఖాన వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు.. ఏమిచ్చినా ఆ రుణం తీర్చుకోలేను’అంటూ ఉబికి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ చేతులెత్తి కృతజ్ఞతలు తెలిపాడు.
అత్యవసర వైద్య సేవలు అందించడంలో సర్కారు దవాఖాన వైద్యులు చొరవ తీసుకుంటున్నారు. కార్పొరేట్కు దీటుగా వైద్యశాలలను సకల సదుపాయాలతో రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దుతున్న నేపథ్యంలో సీరియస్ కేసుల్లోనూ చొరవతీసుకుంటూ మన్ననలు పొందుతున్నారు. కనగల్ మండలం కురంపల్లి గ్రామానికి చెందిన వి.నగేశ్ ఘటన ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
నవంబర్ 15న పురుగుల మందు తాగి ప్రాణాపాయ స్థితిలో ఉన్న నగేశ్ను కుటుంబ సభ్యులు నల్లగొండ జనరల్ దవాఖానకు తీసుకువచ్చారు. వైద్యులు పరీక్షించి వెంటనే ఐసీయూకు తరలించారు. పరిస్థితి చాలా సీరియస్గా ఉన్నదని చెప్పడంతో ప్రైవేటు దవాఖానలకు వెళ్లి నగేశ్ పరిస్థితిని వివరించారు. పది లక్షలకు పైగా ఖర్చవుతుందని, అయినా ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వలేని వైద్యులు తేల్చి చెప్పడంతో హైదరాబాద్కు తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
అప్పటికే పరిస్థితి మరింత విషమించడంతో ప్రభుత్వ దవాఖానలోనే వెంటిలేటర్పై శ్వాస అందించారు. హైదరాబాద్కు తీసుకెళ్లేంత సమయం లేకపోవడంతో డాక్టర్ల సలహా మేరకు ప్రభుత్వ దవాఖానలోనే ఉంచారు. డాక్టర్లు రమేశ్, అనిల్, శ్రీనివాస్, నిషాత్ బృందం సూపరింటెండెంట్ డా.జైసింగ్ రాథోడ్ నేతృత్వంలో అవిశ్రాంతంగా చికిత్స అందించారు. వారం రోజుల తరువాత మార్పు రావడం గమనించి నాణ్యమైన మందులను అందించి 11 రోజులపాటు వెంటిలేటర్పై చికిత్స కొనసాగించారు. ఆరోగ్యం కుదుటపడుతున్న సమయంలో ఊపిరితిత్తుల్లో నిమ్ము రావడంతో ఉపిరి తీసుకోవడం కష్టంగా మారింది. దాంతో వారు ఈఎన్టీ డాక్టర్లు బెంజిమన్, రాజేంద్రప్రసాద్, రమేశ్, ప్రతీక్ రాజ్.. నగేశ్ గొంతుకు శస్త్ర చికిత్స చేశారు. ఐసీయూ బృందం మొత్తం నగేశ్ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని సుమారు 26 రోజులపాటు చికిత్స అందించారు. దీంతో అతడు పూర్తిగా కోలుకుని శనివారం డిశ్చార్జ్ అయ్యాడు.
నాకు పునర్జన్మనిచ్చిన దేవుళ్లు డాక్టర్లు…
పురుగుల మందు తాగిన నేను మళ్లీ కండ్లు తెరిచే సరికి ఆస్పత్రిలో ఉన్నాను. మా బంధువులు వచ్చారు. జరిగినదంతా చెబుతుంటే చాలా భయం వేసింది. వారు నన్ను మళ్లీ ప్రాణాలతో చూస్తామని అనుకోలేదని చెప్పారు. చికిత్స మధ్యలో మళ్లీ ఊపిరి ఆడకపోవడంతో గొంతుకు ఆపరేషన్ చేశారు. మా అమ్మ నాకు జన్మనిస్తే మరో జన్మను ప్రసాదించిన దేవుళ్లు డాక్టర్లు.
సమష్టి కృషితో ప్రాణాలు నిలిపాం…
అత్యంత విష మ పరిస్థితిలో నగేశ్ను దవాఖానకు తీసుకువచ్చారు. వెంటనే సూపరింటెండెంట్ సలహా మేరకు వెంటిలేటర్ను అమర్చి చికిత్స ప్రారంభించాం. సుమారు 11 రోజులపాటు వెంటిలేటర్పైనే ఉంచి ఐసీయూ బృందం డాక్టర్లు, సిబ్బంది చికిత్స అందించాం. నగేశ్ ప్రాణాలు కాపాడడమే లక్ష్యంగా కేసును చాలెంజ్గా తీసుకుని చేసిన శ్రమ ఫలించింది. సమష్టి కృషితో నగేశ్ క్షేమంగా బయటపడ్డాడు.
మందుల కోసం లక్షన్నరకు పైగా ఖర్చు చేశాం…
ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం అందిస్తున్నాం. చాలా ప్రమాదకర కేసులను కూడా హైదరాబాద్కు పంపకుండా ఇక్కడే చికిత్స అందిస్తున్నాం. నగేశ్ అనే వ్యక్తి దాదాపుగా చివరి దశలో ఆస్పత్రికి వస్తే వెంటనే ఐసీయూ సిబ్బందికి తగిన ఆదేశాలు ఇచ్చి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుని 26 రోజులపాటు చికిత్స అందించి ప్రాణాలు నిలిపాం. ఉన్నతాధికారులతో మాట్లాడి మందుల కోసం లక్షన్నరకు పైగా ఖర్చుపెట్టి ప్రాణాలు నిలిపాం. ప్రభుత్వ దవాఖానల్లో మంచి సదుపాయాలు, నిపుణులైన వైద్య బృందం పనిచేస్తున్నారని ప్రజలకు భరోసా కల్పిస్తున్నాం.
ప్రైవేటులో అయితే రూ.6 లక్షలకు పైనే..
నగేశ్ చికిత్స కోసం ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం ప్రైవేటు ఆస్పత్రుల్లో సుమారు 6లక్షలకు పైగా ఖర్చయ్యేది. ఐసీయూలో రోజుకు రూ.8వేలు, వెంటిలేటర్ పెడితే రూ.10వేల చొప్పున చెల్లించాల్సి వచ్చేది. ఆ లెక్కన 20రోజుల పాటు ఐసీయూలో ఉంచితే రూ.3-4లక్షలు, మందుల కోసం రూ.2లక్షలు, గొంతు శస్త్ర చికిత్సకు రూ.40వేలు ఖర్చయ్యేది. మొత్తంగా 26 రోజులకు రూ.6లక్షలకు పైగా చెల్లించాల్సి వచ్చేది. కానీ జనరల్ దవాఖానలో పైసా కూడా ఖర్చు లేకుండా ప్రాణాలతో బయటపడ్డాడు.