టోల్ ఫ్రీ నంబర్ 181
మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన 181 టోల్ ఫ్రీ నంబర్తో బాధితులకు సత్వర సేవలు అందుతున్నాయి. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పని చేసే 181 నంబర్కు రాష్ట్రంలోని ఏ మారుమూల పల్లె నుంచైనా బాధితులు ఫిర్యాదు చేస్తే తక్షణమే సంబంధిత జిల్లాల సఖి కేంద్రాలకు సమాచారం చేరుతుంది. సమీపంలోని సఖి కేంద్రం నిర్వాహకులు బాధితుల వద్దకు వెళ్లి న్యాయ సహాయం, సేవలను అందించడంతోపాటు రక్షణ కోసం సఖి కేంద్రాలకు తరలిస్తారు.
14 మంది సిబ్బంది..
జిల్లా కేంద్రంలోని సఖి కేంద్రంలో 14మంది సిబ్బంది పనిచేస్తున్నారు. అందులో సెంటర్ అడ్మిన్, ఇద్దరు కౌన్సెలర్లు, ఐటీ అసిస్టెంట్, అకౌంటెంట్, ఇద్దరు పారా మెడికల్ సిబ్బంది, ఒకరు పోలీసు సిబ్బంది, ఇద్దరు మల్టీపర్పస్ సిబ్బంది, ఇద్దరు సెక్యూరిటీ గార్డులు, ఇద్దరు కేస్ వర్కర్లు ఉంటారు. సఖి కేంద్రం నిర్వహణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూరుస్తాయి.
నేరుగా వస్తున్న ఫిర్యాదులే అధికం..
టోల్ఫ్రీ నంబర్ 181కు వస్తున్న ఫిర్యాదుల కన్నా జిల్లా కేంద్రంలోని సఖి సెంటర్కు వచ్చే ఫిర్యాదులే ఎక్కువగా ఉన్నాయి. సఖి కేంద్రం నిర్వహణ, సేవలపై ప్రజలకు కల్పిస్తున్న అవగాహ కార్యక్రమాలతో బాధితులు సఖి కేంద్రాన్ని వచ్చి తమ సమస్యను చెప్పుకుంటున్నారు. జిల్లాలో ప్రారంభం నాటి నుంచి 507 కేసులు నమోదు కాగా అందులో 434 నేరుగా, 73 కేసులు 181 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా వచ్చాయి.
ఏయే కేసులు వచ్చాయంటే..
మొత్తం 507 కేసుల్లో.. గృహహింస-332, లైంగిక దాడి-5, లైంగిక వేధింపులు-4, వ్యభిచారం చేస్తూ పట్టుబడటం-2, మైనర్ బాలికలపై లైంగిక వేధింపులు-21, బాల్య వివాహాలు-11, మిస్సింగ్స్, కిడ్నాపింగ్-38, ప్రేమ వివాహాలు, మోసపోవడం-28, వరకట్న వేధింపులు-22, చిన్న పిల్లల అమ్మకం-2, చిన్న పిల్లల కిడ్నాపింగ్-1, వయోవృద్ధులు, మానసిక వికలాంగులు తదితర కేసులు-41 ఉన్నాయి.
సేవలపై విస్తృత ప్రచారం
సఖి కేంద్రం(వన్ స్టాప్ సెంటర్)పై సార్ప్ సంస్థ సభ్యులు, సఖి కేంద్రం సిబ్బంది విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆటో స్టాండ్లు, బస్స్టేషన్లు, పాఠశాలలు, కళాశాలలు, దవాఖానల్లో సఖి కేంద్రం నిర్వహణ, సేవలపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వారి సమస్య ఒక్కసారితోనే పరిష్కారం కావాలనే ఉద్దేశంతో ఈ కేంద్రానికి వన్స్టాప్ సెంటర్ అని కూడా పేరు పెట్టారు.
ఎల్లప్పుడూ అందుబాటులో..
బాధితులకు సత్వర న్యాయ సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సఖి కేంద్రం లో సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. బాధితులకు అవసరమైన మేరకు కౌన్సెలింగ్ నిర్వహించి న్యాయం సేవలు అందిస్తున్నాం. బాధితుల్లో భరోసా నింపి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నాం.
-కృష్ణవేణి, మహిళా, శిశు సంక్షేమశాఖ జిల్లా అధికారి