20 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ను వాడొద్దంటూ అవగాహన
నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా
కొరడా ఝుళిపిస్తున్న అధికారులు
శంషాబాద్, డిసెంబర్ 3: ప్లాస్టిక్ నిషేధంపై శంషాబాద్ మున్సిపల్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ ముమ్మరం చేశారు. శంషాబాద్ మున్సిపల్ పట్టణంలో అధిక శాతం అమ్మకం, కొనుగోలు దారులు ఎక్కువగా ప్టాస్టిక్ సంచులనే వాడుతుండటంతో అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. దుకాణ యజమానులకు ఆదేశాలు జారీ చేస్తూ ప్టాస్టిక్ కవర్లు నియంత్రించి కాగితపు, జూట్ సంచులను వాడాలని సూచిస్తున్నారు. 20 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ సంచులు, కవర్లను విక్రయించరాదని ప్రభుత్వం సూచించింది. నిబంధనలు ఉల్లఘించిన వారికి రూ.5వేల జరిమానా విధిస్తామని హెచ్చరిస్తున్నారు. ప్టాస్టిక్ కవరు,్ల వ్యర్థాలను మురుగు కాల్వల్లో వేస్తుండటంతో అవి పూడికల్లో పేరుకుపోతున్నాయి. అంతే కాకుండా డ్రైనేజీల్లో, రహదారులపై పడవేసే ప్లాస్టిక్ సంచులు కాలువల్లో తట్టుకొని వరదనీరు, మురుగు నీరు పారకుండా అడ్డుకుంటుంది. మున్సిపల్ అధికారులు ప్టాస్టిక్ నియంత్రణపై పాఠశాలలు, వ్యాపారులు, ప్రజలతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయంగా కాగితపు, జూట్ సంచులు వినియోగించాలని చైతన్యపరుస్తున్నారు. నిరుద్యోగ యువత, స్వయంసహాయక సంఘాల సభ్యులకు ఉపాధి కల్పించే విధంగా కాగితపు సంచుల తయారీపై ప్రత్యేక శిక్షణ ఇచ్చి రుణసదుపాయం కల్పించాలని పలువురు కోరుతున్నారు.
ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటే లక్ష్యం
ప్లాస్టిక్ వినియోగంపై చట్టపరంగా చ ర్యలు కఠినతరం చేస్తాం. ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా శంషాబాద్ ను తీర్చిదిద్దడమే లక్ష్యం. విక్రయాలు జరిపే వ్యాపారులపై చర్యలు తీసుకుంటాం. జరిమానా విధిస్తాం. ప్రజల్లోనూ చైతన్యం రావాలి. సమష్టి కృషి అవసరం.
-సుష్మారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్