ఖైరతాబాద్ : తల్లి పాల విశిష్టత…దాని ప్రాధాన్యత అంశాలను ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 7 నుంచి నగరంలో సౌత్ ఇండియా లాంబ్కాన్ 2021 సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజింగ్ కమిటీ ప్రతినిధులు డాక్టర్ మంచుకొండ రంగయ్య, డాక్టర్ సి. సురేశ్ కుమార్, డాక్టర్ సంతోష్, డాక్టర్ శ్రీనివాస్లు తెలిపారు.
సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సదస్సుకు సంబంధించిన బ్రోచర్లను డాక్టర్ వృశాలి, డాక్టర్ వరుణ్, డాక్టర్ విజయానంద్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు సదస్సు వివరాలను వెల్లడించారు.
మొదటి రోజు 7న రామకృష్ణ మఠ్లో ‘ఆర్యజనని’ పేరుతో గర్భంతో ఉన్న మహిళలు, గర్భం దాల్చాలనుకున్న వారు, బాలింతలు, వారి సంరక్షకులు, ఇంట్లో పెద్దల కోసం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు అవగాహన సదస్సును నిర్వహిస్తున్నామని, ఇందులో మానసిక, శారీరక ఆరోగ్యంతో పాటు పౌషకాహారంపై అవగాహన కల్పిస్తామన్నారు.
బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ మూడు బాగుండాల్సి ఉంటుందన్నారు. శిశువుకు మొదటి రెండు సంవత్సరాలు మెదడు అభివృద్ధి చెందే దశ ఉంటుందని, ఆ సమయంలో ఎలాంటి పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలన్నదానిపై వివరిస్తామన్నారు.
పెద్దలు సీమంతం నిర్వహించడంలో ఆ శాస్త్రీయత ఉందని, 24 వారాల తర్వాత శిశువు సాధారణ జీవనం సాగిస్తుందని, అన్ని అవయవాలు సంపూర్ణంగా ఏర్పడుతాయని, ఆ నేపథ్యంలో ఆ వేడుకలు నిర్వహించుకోవడం కేవలం భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో వేర్వేరు పేర్లతో నిర్వహిస్తారని, పుట్టబోయే బిడ్డకు ప్రాధాన్యత ఇవ్వడంలో ఇది భాగమన్నారు.
12, 13, 14 తేదీల్లో హోటల్ మారియట్లో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది కోసం కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామని, 12న బేసిక్, అడ్వాన్స్డ్తో పాటు మిల్క్బ్యాంక్పై వర్క్ షాప్స్ జరుగుతాయన్నారు. దేశంలో 50 శాతం మాత్రమే తల్లులు పిల్లలకు తమ పాలను ఇస్తున్నారని తెలిపారు.
మురుపాలు తాగితే ఆ బిడ్డకు జీవితంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని, కొందరు తల్లులకు పాలు రావని, అవి ఎందుకు రావడంలేదు ఇతర ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పిస్తామన్నారు. 13, 14 తేదీల్లో బ్రెస్ట్ పీడింగ్, మిల్క్ బ్యాంకింగ్, ప్రీ మెచ్యూర్ బేబీస్ కు తల్లి పాలు ఎలా అందించాలన్న అంశంపై చర్చ జరుగుతుందన్నారు.
13న సాయంత్రం 6గంటలకు ఈ సదస్సును భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, కేంద్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్లు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారన్నారు. పుట్టిన వెంటనే తల్లి పాలు ఇవ్వడం నేర్పించాలని, డాక్టర్స్, నర్సులు దీనిని ప్రోత్సహించాలన్నారు.
నెల తక్కువగా పుట్టిన పిల్లలకు ఐసీయులో ఉంచి చికిత్స అందిస్తారని, ఆక్రమంలో తల్లి పాలకు దూరమవుతారని, వారికి చికిత్స పూర్తయిన తర్వాత కొందరు తల్లులకు పాలు రావని, అలాంటి క్రమంలో మిల్క్ బ్యాంకు ఎంతో దోహదపడుతుందన్నారు.
దేశంలో చాలా మిల్క్ బ్యాంక్స్ ఉన్నాయని, కాని అత్యధిక పాలను పిల్లలకు అందిస్తున్న ఏకైక బ్యాంకు నిలోఫర్లో ఉందన్నారు. ప్రతి రోజు 5 లీటర్ల పాలు అందిస్తున్నారని తెలిపారు. మిల్క్ బ్యాంకు అభివృద్ధి, దానిపై అవగాహన తదితర అంశాలపై చర్చిస్తామన్నారు.