వ్యవసాయ యూనివర్సిటీ:లక్ష్యసాధనకు పట్టుదలగా పనిచేస్తే ఎంతటి ఉన్నత శిఖరాలనైనా సాధించవచ్చని , రాష్ట్ర అభివృద్ధిలో కో -ఆపరేటివ్ సొసైటీల పాత్ర ఉందని మాజీ ఉపముఖ్యమంత్రి , స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే డా. రాజయ్య అన్నారు. శుక్రవారం రాజేంద్రనగర్లోని టిఎస్క్యాబ్- సిటిఐ ఆడిటోరియంలో ముద్ర అగ్రికల్చర్ , స్కిల్ డెవలఫ్మెంట్ మల్టీస్టేట్ కో ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో, నూతన సహాకార మంత్రిత్వశాఖకు సహాకార జనుల సూచనలు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
సమాజంలో మంచి పేరుతో జీవించాలంటే పట్టుదల ఎంతో ముఖ్యమన్నారు. మనం చేస్తున్న పని ఇతరులకు హాని కలగకుండా చూడాలని, పలువురికి ఆదర్శంగా బతకాలని ఆయన సూచించారు.ముద్ర వంటి సొసైటీలు రాష్ట్ర వ్యాప్తంగా అట్టడుగు ప్రజల పక్షాన ఉంటూ ఎనలేని సేవ చేస్తున్నాయన్నారు. పదేళ్ల క్రితం వరకు రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా సామాన్యుల జీవనంలో మార్పు రాలేదని , సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధివైపు పయనిస్తుందంటే ఆయన పట్టుదల, నిరంతర కృషి కారణమని అన్నారు.
భారత రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్ అంబేద్కర్ నిరంతర కృషి ఫలితంగా మహిళలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో ప్రాధాన్యత పెరిగిందని చెప్పారు. కార్యక్రమంలో ముద్ర మేనేజింగ్ డైరెక్టర్ , నేషనల్ లేబర్ కో-ఆఫరేటివ్స్ ఫెడరేషన్ అధికారి ఎన్. సత్యనారాయణ, పూర్వపు బీసీ కమీషన్ సభ్యులు, తెరాస రాష్ట్ర నాయకులు వకుళాభరణం కృష్ణమోహన్, ముద్ర అగ్రి సొసైటి చైర్మెన్ , తెలంగాణ మానవ హక్కుల చైర్మెన్ తిప్పినేని రామదాసప్ప నాయుడు తదితరులు పాల్గొని సభ్యులకు పలు సూచనలు చేశారు.