రవింధ్రభారతి : ఎంతోమంది పాము కాటు బాధితులు భయం, షాక్లతోనే మరణిస్తున్నారని , ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పాముదాడులను నిరోధించేందుకు ప్రజల్లో అవగాహన పెంచాల్సి ఉందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఆదివారం పాముకాట్లపై అవగాహన జాతీయ సదస్సులో ఆమె ప్రసంగించారు.
అగ్రగామి ఆరోగ్య అవగాహన సంస్థ ఇంటిగ్రేటెడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ (ఐహెచ్డబ్ల్యూ) కౌన్సిల్ ఈ సదస్సు నిర్వహించింది. ఏటా సెప్టెంబరు 19న నిర్వహించే అంతర్జాతీయ స్నేక్ బైట్ అవర్నెస్ డేను పురస్కరించుకుని ఈ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ సగటున ఏటా 58,000 మంది చొప్పున, 2000 వేల నుంచి 2019 సంవత్సరం మధ్య కాలంలో 12 లక్షల మంది పాము కాటుతో మరణించారని ఆమె పేర్కొన్నారు. పేరుకుపోయిన వర్షం నీళ్ళలో నడవడం ప్రమాదకరమని, చనిపోయిన పాముల కోరల కారణంగా శరీరాల్లోకి విషం చేరి మరణించిన వారి ఉదంతాలు కూడా ఉన్నాయన్నారు.
వస్తువులను నిల్వ చేసిన చోట పడుకోవద్దన్నారు. దోమ తెరలను ఉపయోగించడం ద్వారా దోమలతోపాటు పాముల నుంచి కూడా రక్షణ పొందవచ్చునన్నారు. అనంతరం భారత్ సిరమ్స్ అండ్ వాక్సీన్ లిమిటెడ్ సిఇఓ విశ్వానాథ్ స్వరూప్ మాట్లాడుతూ పాము కాటుకు సులభ పరిష్కారాలు అందించే వీలుందన్నారు. ఐహెచ్ డబ్ల్యూ కౌన్సిల్ అడ్వకసీ అండ్ గవర్నమెంట్ అపైర్స్ ప్రిన్సిపల్ కన్సల్టెంట్ డాక్టర్ నాయక్ కౌశిక్ మాట్లాడుతూ నిర్లక్ష్యం చేయబడిన ట్రిపికల్ వ్యాధుల ప్రాధాన్య జాబితాల్లోకి ప్రపంచ ఆరోగ్య సంస్థ పాము కాట్లను చేర్చడంలో ఎలాంటి అశ్చర్యంలేదన్నారు.