ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉద్యోగుల జిల్లా క్యాడర్ కేటాయింపుల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. సీనియారిటీ జాబితాలను ఫైనల్ చేసి, దాని ఆధారంగా కేటాయింపులు కూడా పూర్తి చేశారు. ఉపాధ్యాయులకు సంబంధించిన కసరత్తు మాత్రం తుది దశలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. శనివారం అర్ధరాత్రికి గానీ ఆదివారం ఉదయం వరకు గానీ పూర్తి చేయాలన్న తలంపుతో అవిశ్రాంతంగా పని చేస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 21వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు జిల్లా క్యాడర్ పరిధిలోకి వచ్చారు. ప్రస్తుత ప్రక్రియతో వీరంతా కొత్త జిల్లాల వారీగా శాశ్వత ప్రాతిపదికన తాము పెట్టుకున్న ఆప్షన్ల ఆధారంగా విధుల్లో చేరాల్సి ఉంటుంది. మూడు జిల్లాల్లో అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు జరుగనున్నది. ఈ ప్రక్రియతో ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత మెరుగ్గా, సులువుగా అందనున్నాయి. ఇదే సమయంలో కొత్త ఉద్యోగాల కల్పనపైనా స్పష్టత రానున్నది.
నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్18(నమస్తే తెలంగాణ) : నూతన జోన్ల ఏర్పాటు అనంతరం ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగులను వారి స్థాయిలను బట్టి క్యాడర్లుగా విభజించిన విషయం తెలిసిందే. అయితే జిల్లా క్యాడర్ కేటాయింపులను జిల్లాలోని కలెక్టర్ ఆధ్వర్యంలోనే చేపట్టనుండగా జోన్ల క్యాడర్ను వివిధ శాఖల రాష్ట్ర ఉన్నతాధికారులు, మల్టీజోన్ క్యాడర్ను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్నది. ఈ మేరకు ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా పరిధిలోని క్యాడర్కు చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులను జిల్లాల వారీగా కేటాయింపుల ప్రక్రియ చేపట్టారు. ఇప్పటికే ఈ విషయంలో ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న వారందరికీ ఏ జిల్లాను ఎంచుకుంటారో ఆప్షన్లు ఇవ్వాలని కోరారు. దీంతో ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యత ప్ర కారం మూడు ఆప్షన్లు ఇస్తూ తమ విభాగాలకు అందజేశారు. వాటన్నింటినీ ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. వాటి ఆధారంగా సీనియారిటీ జాబితాలను ముందుగా సిద్ధం చేశారు. ఈ నెల 15 నుంచి పూర్తిస్థాయిలో దీనిపై జిల్లా అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ స్వయంగా ప్రతి విషయాన్ని పర్యవేక్షిస్తూ సంబంధిత వర్గాలతో సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్నా రు. దాంతో శనివారానికి ఉద్యోగులకు సం బంధించిన సీనియారిటీ జాబితాతోపాటు కే టాయింపులు కూడా పూర్తి చేశారు. మొత్తం 21 వేల మందిలో 12,200 మంది ఉపాధ్యాయు లు పోగా, మిగతా వారికి సంబంధించి సీనియారిటీ గుర్తింపుతోపాటు కేటాయింపులు జరిగాయి. ఇక వీరికి ఆర్డర్స్ ఇవ్వడమే తరువాయి. తదుపరి ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ చేసేందుకు అంతా సిద్ధం చేశారు. దాంతో ఉద్యోగ వర్గాల్లో ఎవరికి ఏ జిల్లా కేటాయింపు జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొన్నది. సీనియారిటీ ఆధారంగా కేటాయింపులు జరుగనుండడంతో ఆన్లైన్ ప్రక్రియలో జాగ్రత్తగా పర్యవేక్షించారు. ఎక్కడైనా సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు వస్తే వెంటనే వాటిని నిబంధనల ప్రకారం మరోసారి సరి చూశారు. ఏమైనా అనుమానాలుంటే ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించి నివృత్తి చేశారు. ఇందులో మెడికల్ గ్రౌండ్లో సడలింపునకు అవకాశం ఇవ్వడంతో ఉద్యోగ, ఉపాధ్యాయులవి కలిపి మొత్తం 1500 వరకు దరఖాస్తులు వచ్చాయి. వాటిపై ప్రత్యేక వైద్య బృందంతో వెరిఫికేషన్ చేయించి నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకున్నారు. గుండె సంబంధిత వ్యాధులు, క్యా న్సర్, మానసిక రుగ్మతులున్న పిల్లలు, విడోల విషయంలో మినహాయింపులు ఇచ్చారు. మెడికల్ గ్రౌండ్స్లోనూ ప్రక్రియను సజావుగా ము గించారు. ఇక ఉపాధ్యాయుల విషయంలో అ త్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. సీనియారిటీ జాబితా విషయంలో మార్పులు, చేర్పులు కావాలని కొన్ని ఉపాధ్యాయ సం ఘాలు కోరడంతో కలెక్టర్ ప్రశాంత్జీవన్ పాటిల్ వారితో సమావేశమయ్యారు. వారి అనుమానాలను నిబంధనల ప్రకారం నివృత్తి చేస్తూ సీనియారిటీ జాబితాను, కేటాయింపుల ప్రక్రియను తుది దశకు తీసుకొచ్చారు. ఇది నేడు పూర్తికానున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. మొత్తంగా జిల్లాల వారీగా క్యాడర్ కేటాయింపుల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా పూర్తి చేస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. ఇందుకు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగులు సహకరించినట్లు చెప్పారు. ప్రక్రియను పూర్తి చేయడంలో వివిధ విభాగాల సిబ్బంది కృషిని అభినందించారు.