గజ్వేల్లో అనుమతులు లేకుండా భవన నిర్మాణానికి తీసిన గుంతలతో మరో భవనానికి ప్రమాదం
బిల్డింగ్తో పాటు జియో టవర్ ధ్వంసం
తప్పిన ప్రాణాపాయం.. ఒకరికి తీవ్ర గాయాలు
గజ్వేల్ అర్బన్, మార్చి 18: అనుమతులు లేకుండా భవన నిర్మాణ పనుల్లో భాగంగా లోతైన గుంతలు తీయడంతో పక్కనే ఉన్న జీ ప్లస్టూ భవనం పక్కకు ఒరిగి కుప్పకూలింది. గజ్వేల్ పట్టణంలో గజ్వేల్-ప్రజ్ఞాపూర్ రహదారిలో సంతోష్ థియేటర్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గజ్వేల్ కు చెందిన అయిన కృష్ణ 2011లో గ్రామపంచాయతీ అనుమతులతో గజ్వేల్-ప్రజ్ఞాపూర్ రోడ్డుపై గల బ్రిడ్జి సమీపంలో జీ ప్లస్ టూ భవనాన్ని నిర్మించుకున్నారు. దాని పక్కనే ఉన్న పాత భవనాన్ని తొలగించి నూతనంగా భవనాన్ని నిర్మించుకోవడానికి పి.రవీందర్రెడ్డి అనే వ్యక్తి పునాదులు తీసే క్రమం లో బాగా లోతుగా మట్టిని తవ్వారు. అయిల కృష్ణ భవనాన్ని ఆనుకుని ఉన్న మట్టిని పూర్తిగా తొలగించారు. రవీందర్రెడ్డి అనుమతులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా, మున్సిపాలిటీనుంచి అనుమతులు లభించక ముందే ఇంటి నిర్మాణం ప్రారంభించాడు. ఇంటి నిర్మాణ పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్ పనులను నిలిపివేయాలని స్థల యజమానులను ఆదేశించారు. బాగా లోతుగా గుంతలు తీయడంతో మురుగు కాల్వలకు కూడా దగ్గరగా ఉండడంతో క్రమంగా ఆ ప్రాంతమంతా నీరు చేరి భూమి కుంగిపోయింది. గురువారం వేకువజామున 3గంటల ప్రాం తంలో ఒక్కసారిగా భవనం పక్కకు వంగిపోయి కుప్పకూలింది. భవనంపై ఉన్న జియో టవర్ కూడా పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ లైన్లపై పడిపోయింది. దీంతో ఆ ప్రాంతమం తా ఒక్కసారిగా విద్యుత్ సరఫరాలో అంతరా యం ఏర్పడింది. భవ నం కూలడానికి 5 నిమిషాల ముందే ఆ భవనంలోని బోర్వెల్ కార్యాలయంలో కూలీలు నిద్రించారు. యజమాని బోరు వేయడానికి వారిని పంపడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. యాదగిరి అనే వ్యక్తి నిద్రిస్తుండగా అందులో చిక్కుకుపోయాడు. భవనం కూలుతున్న విషయా న్ని గుర్తించిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు యాదగిరిని స్వల్ప గాయాలతో బయటకు తీసుకువచ్చారు. భవనం కింద పార్కింగ్ చేసిన కొత్త కారు కూడా పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్, టౌన్ ప్లానింగ్ అధికారి రాజీవ్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సీఐ ఆంజనేయులు, ట్రాఫిక్ సీఐ మధుసూదన్రెడ్డి తమ సిబ్బందితో ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, వైస్ చైర్మన్ జకీయొద్దీన్, కౌన్సిలర్లు ఉప్పల మెట్టయ్య, భాగ్యలక్ష్మి దుర్గాప్రసాద్, బాలేశ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. జియో కంపెనీకి స మాచారం అందించి టవర్ను విద్యుత్ లైన్లపై నుంచి తొలగించడానికి చర్యలు చేపట్టారు. ‘గడా’ ప్రత్యేకాధికారి ము త్యంరెడ్డి, మున్సిపల్ చైర్మన్, కమిషనర్ గాయపడ్డ యాదగిరిని దవాఖానలో పరామర్శించారు. ప్రమాదానికి కారణమైన రవీందర్రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు సీఐ ఆంజనేయులు తెలిపారు. ప్రమాదాన్ని గుర్తించి సమాచారం అందించడంతో పాటు యాదగిరిని కాపాడినందుకు ఏఎస్సైఐ అక్బర్, కానిస్టేబుళ్లు మల్లయ్య, రవికుమార్, హోంగార్డు, సంతోష్ను అభినందించారు.