కొండాపూర్ : సీసీ కెమెరాల ఏర్పాటుతో భద్రత మరింత పటిష్టమవుతుందని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. సోమవారం చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఫ్రెండ్స్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మాదాపూర్ డీసీపీ కే శిల్పా వల్లితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో భద్రత మరింత మెరుగవుతుందన్నారు. రాత్రి వేళల్లో ఆకతాయిల అల్లర్లతో పాటు దొంగతనాలను పూర్తిగా నియంత్రించగలమన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై పోలీసులు కల్పిస్తున్న అవగాహనతో కాలనీ వాసులు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు.
ప్రతి కాలనీ, బస్తీల్లో సీసీ కెమెరాల ఏర్పాట్లకు అసోసియేషన్లు కృషి చేయాలన్నారు. అనంతరం మాదాపూర్ డీసీపీ శిల్పా వల్లి సీసీ కెమెరాల ప్రాముఖ్యతతో పాటు మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథరెడ్డి, మియాపూర్ ఏసీపీ క్రిష్ణ ప్రసాద్, చందానగర్ ఇన్స్పెక్టర్ కాస్ట్రో, కాలనీ అధ్యక్షులు వెంకటేశం, చందానగర్ పోలీసు స్టేషన్ సిబ్బంది, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.