సికింద్రాబాద్ : తెలంగాణ సాయుధ పోరాట సమరయోధురాలు చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఈ మేరకు ఆదివారం న్యూ బోయిన్పల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో రజక సంఘం నేతలతో కలిసి మంత్రి మల్లారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా అప్పటి దొరలు, రజాకారులపై పోరాడిన ఐలమ్మ ధీరవనితగా నిలిచిందన్నారు. తెలంగాణ సాధన, అస్తిత్వంలో స్ఫూర్తి దాయకంగా నిలిచిందన్నారు. ఒక మహిళా అయినప్పటికీ ఐలమ్మ నిరంకుశ పాలనకు ఎదురు తిరిగి పోరాడిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే పోరాటం చేశారని తెలిపారు. ఐలమ్మ లాంటి మహా యోధురాలిని గౌరవించడం మనందరి నైతిక బాధ్యత అన్నారు. ఎన్ని కష్టాలున్నా, ఎలాంటి ఇబ్బందులున్నా ప్రతి ఒక్కరూ రాష్ట అభివృద్ధి కొరకు కలిసికట్టుగా, పట్టుదలతో పని చేయాలని సూచించారు.
రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు దేశంలో ఎక్కడాలేవని స్పష్టం చేశారు. అందులో భాగంగానే రాష్ట్రంలో రజకులకు దోబీ ఘాట్లు, అవసరమైన డ్రైక్లీనింగ్ యంత్రాలు ప్రభుత్వం తరపున ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా అందించడం జరుగుతుందన్నారు. ఇటీవల కాలంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ రజకులకు, నాయిబ్రాహ్మణులకు ఉచిత కరెంటు సదుపాయం కల్పించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, రాజేష్, జనార్దన్, రాములుతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.