విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను తరలించాలి
కట్టడాలు, ప్రార్థనా మందిరాల తొలగింపు సమస్యను పరిష్కరించాలి
సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు
జాతీయ రహదారుల పనుల పురోగతిపై సమీక్ష
సంగారెడ్డి, ఆగస్టు 11: జిల్లాలో జాతీయ రహదారుల విస్తరణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు సూచించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ రహదారులు 161, 161-బీ, 765-డీ పనుల పురోగతిపై నేషనల్ హైవే అథారిటీ, అటవీ, విద్యుత్తు, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, రెవెన్యూ, వక్ఫ్ బోర్డు, దేవాదాయశాఖల అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రహదారుల విస్తరణలో భాగంగా నిర్మాణాలకు అడ్డుగా ఉన్న కట్టడాలు, ప్రార్థనా స్థలాలు, విద్యుత్తు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, తాగునీటి పైపులైన్లు అటవీ భూములకు సంబంధించిన సమస్యలుంటే ఆయా శాఖల అధికారుల సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు. 161-బీ రహదారి పనుల్లో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల తరలింపునకు సంబంధించి వెంటనే చర్యలు చేపట్టాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. తాగునీటి సరఫరా పైపులైన్లకు సంబంధిత ఏజెన్సీకి అంచనాలు ఇవ్వాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రఘువీర్కు సూచించారు. ఆయా జాతీయ రహదారుల నిర్మాణ పనులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడంలో ఆయా మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ డివిజన్ అధికారులు చొరవ చూపాలన్నారు. రహదారుల విస్తరణలో ఏర్పడే సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని, భూసేకరణ, చెల్లింపులకు సంబంధించి నిబంధనల మేరకు ముందుకు వెళ్లాలని కలెక్టర్ కోరారు. సమావేవంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, నేషనల్ హైవే-161 పీడీ మధుసూదన్రావు, నీటి పారుదలశాఖ ఎస్ఈ మురళీధర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రఘువీర్, జిల్లా అటవీ శాఖాధికారి వెంకటేశ్వర్లు, విద్యుత్తు, వక్ఫ్, ఎండోమెంట్శాఖల అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు, ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.