హుజూరాబాద్ టౌన్, డిసెంబర్ 31: చేనేత వస్త్రాలపై సీజీఎస్టీ 5శాతం నుంచి 12శాతం పెంపు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవడంపై హుజూరాబాద్ పట్టణంలో నేతకార్మికులు హర్షం వ్యక్తం చేశారు. పటాకులు కాల్చి సంబురాలు జరుపుకొన్నారు. కేంద్రం సీజీఎస్టీ ప్రతిపాదనల ఉపసంహరణకు కృషి చేసిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు, రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి కే తారకరామారావు చిత్రపటానికి హుజూరాబాద్ చేనేత సహకార సంఘం అధ్యక్షుడు ఎలిగేటి ఉపేందర్, ఉపాధ్యక్షుడు వేముల యాదగిరి, డైరెక్టర్లు, కార్మికులు పాలాభిషేకం చేసి, కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో చేనేత సహకార సంఘం డైరెక్టర్లు కుడికాల ప్రభాకర్, మండల సత్యనారాయణతో పాటు చేనేత పారిశ్రామికులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
గంగాధరలో..
గంగాధర, డిసెంబర్ 31: వస్త్ర పరిశ్రమపై సీజీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాయడంపై గర్శకుర్తి వస్త్ర వ్యాపారుల సంఘం, బతుకమ్మ చీరల ఉత్పత్తిదారుల సంఘం, పద్మశాలీ సంఘం, మరమగ్గాల సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం గర్శకుర్తిలో ఆయా సంఘాల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు.