బొడ్రాయిబజార్, నవంబర్ 26 : మొక్కల పెంపకంపై ఆసక్తికి తోడు హరితహారం స్ఫూర్తితో ఆ ప్రజాప్రతినిధులు తమ ఇండ్లను హరిత నిలయాలుగా తీర్చిదిద్దారు. మొక్కలను సంరక్షించాలని ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించడంతో పాటు ఆచరించి ఆదర్శంగా నిలుస్తున్నారు.. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన పలువురు మహిళా కౌన్సిలర్లు. పట్టణంలోని 19వ వార్డు కౌన్సిలర్ సుంకరి అరుణ, 42వ వార్డు కౌన్సిలర్ అంగిరేకుల రాజశ్రీ తమ నివాసాల్లో సుమారు 200 నుంచి 300 రకాల మొక్కలు నాటించారు. రోజూ రెండు గంటల సమయం కేటాయిస్తూ వాటిని సంరక్షిస్తున్నారు. దాంతో అటువైపుగా వెళ్లే వారు ఇంటి వైపు ఆసక్తిగా చూస్తున్నారు. తీరొక్క మొక్కలు, పచ్చదనంపై అబ్బురపడుతున్నారు. రక రకాల పూలు, పండ్లు, కూరగాయల మొక్కలను అందంగా అలంకరించి సంరక్షించడంతో పరిసరాలు సైతం ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి. మొక్కలపై ఆసక్తి ఉన్నవారు ఓ అడుగు ముందుకేసి ఇంటికి వెళ్లి మొక్కలపై ఆరా తీస్తున్నారు. ఏ మొక్క ఎక్కడ తెచ్చారు..? ఎలా పెంచాలి..? ఏ పూలు పూస్తాయి..?! అని అడిగి మరీ తెలుసుకుంటున్నారు. పచ్చని నిలయాల్లో పిచ్చుకలూ గూడు కట్టుకుంటున్న వైనం ప్రకృతి వాతావరణాన్ని కళ్లకు కడుతున్నది.
హరితహారం
మరింత ప్రేరణ ఇచ్చింది…
మొక్కలు పెంచడం నాకెంతో ఇష్టం. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన హరితహారంతో మరింత ప్రేరణ పొందాను. మొక్కల పంపిణీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ వార్డు ప్రజల్లో అవగాహన కల్పించాను. మా ఇల్లు ఆదర్శంగా ఉండాలని 300 మొక్కల వరకు నాటి సంరక్షిస్తున్నా. రోజూ ఉదయం సాయంత్రం మొక్కలకు నీళ్లు పోయడంతో పాటు పండు ఆకులను తొలగిస్తుంటాను. మొక్కల సంరక్షణతో మనస్సు ఉల్లాసంగా ఉంటుంది.
సగం సమయం మొక్కలతోనే…
రోజులో సగం సమయం మా ఇంటి ఆవరణలో, రోడ్డుపై పెంచుతున్న మొక్కల సేవలోనే సరి పోతుంది. పని ఒత్తిడి వల్ల ఏ రోజైనా మొక్కలకు నీళ్లు పెట్టకుంటే ఆ రోజంతా ఎంతో వెలితిగా ఉంటుంది. మా ఇంటికి వచ్చిన వారంతా ఇన్ని మొక్కలు ఎలా కాపాడుతున్నారని అడుగుతుంటారు. ఇష్టంగా చేస్తే ఏదైనా సాధ్యమే అని వారికి చెప్తాను. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్నదే నా తపన.