శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి మండల రెవెన్యూ పరిధిలోని గోపన్పల్లిలో ప్రభుత్వ స్థలంలో వెలసిన అక్రమ గుడిసెలను మండల రెవెన్యూ అధికారులు సోమవారం కూల్చివేశారు. శేరిలింగంపల్లి మండల తాసీల్థారు వంశీమోహాన్ అదేశాల మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ అధ్వర్యంలో ఈ కూల్చివేతలు నిర్వహించారు.
గౌలిదొడ్డి గ్రామంలోని గోపన్పల్లి ప్రభుత్వ సర్వేనెంబర్ 37లో ప్రదాన రహాదారి పక్కన గత కొంతకాలంగా పెద్ద ఎత్తున గుడిసెలు వెలిశాయి. గౌలిదొడ్డి జర్నలిస్టు కాలనీకి అనుకొని ఉన్న ఈ ప్రభుత్వ స్ధలంలో దాదాపు 50 గుడిసెలు వెలి శాయి. కాగా సోమవారం ఉదయం స్థానిక శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు జేసీబీ సహాయంతో సదరు గుడిసెలను నేలమట్టం చేశారు.
కూలీపని చేసుకొని జీవించే రోజువారీ కూలీలతో పాటు రాజస్థాన్కు చెందిన పీఓపీ బొమ్మల తయారీదారులు ఈ స్థలంలో 2 సంవత్సరాలుగా అక్రమంగా గుడిసెలు వెసుకొని నివసిస్తున్నారు. గుడిసెలను నెలమట్టం చేయడాన్ని జీర్ణించుకోలేని సదరు గుడిసెవాసులు పోలీసులతో తీవ్ర వాగ్వివాదానికి దిగారు.
తమ గుడిసెలను తొలగించడాన్ని వ్యతిరేకిస్తు పోలీసులతో గొడవకు దిగారు. అప్పటికే అక్కడకు చేరుకున్న ప్రత్యేక పోలీసు బలగాలు సదరు అందోళన కారులను చెదరగొట్టారు. కాసేపటికి తీవ్ర ఉద్రిక్తల నడుమ రెవెన్యూ అధికారులు కూల్చివేతలు పూర్తి చేశారు.
గచ్చిబౌలి సబ్ ఇన్స్పెక్టర్ వెంకట్రెడ్డి, సురేందర్ రెడ్డిలతో పాటు పలువురు పోలీసు సిబ్బంది, మహిళ పోలీసులు, స్థానిక శేరిలింగంపల్లి మండల రెవెన్యూ సిబ్బంది ఈ కూల్చివేతల్లో పాల్గొన్నారు.