రైతుబంధు సాయంతో పంట పెట్టుబడికి అప్పులు చేసే కష్టాలు తీరాయని కర్షకులు సంబురాలు చేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వారోత్సవాలు అట్టహాసంగా సాగుతున్నాయి. శుక్రవారం ఊరూ వాడలో పండుగ వాతావరణం నెలకొన్నది. రైతువేదికలు, ఇండ్ల ఎదుట అందమైన రంగవల్లులు.. విద్యార్థులకు వివిధ పోటీలు.. ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో ర్యాలీలు.. పంట పొలాల్లో వేరుశనగ, వరి నార్లతో రైతుల ప్రదర్శనలు.. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు.. అంబరాన్నంటేలా జరిగాయి. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రైతుబంధు వారి జీవితాల్లో సంక్రాంతి పండుగకు ముందే సంతోషం తీసుకురావడంతో అన్నదాతల మోములో ఆనందం వెల్లివిరుస్తున్నది.
రైతుబంధు వారోత్సవాలు కొనసాగుతున్నాయి.. ఊరూరా వేడుకలు నిర్వహిస్తున్నారు.. రైతులు, టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేస్తున్నారు.. పాఠశాలల్లో, గ్రామాల్లో నిర్వహించిన ముగ్గులు, వ్యాసరచన పోటీల్లో విద్యార్థులు, మహిళలు ఆసక్తిగా పాల్గొంటున్నారు.. అన్నదాతలు పంటపొలాల్లో జై రైతుబంధు, జై కేసీఆర్ అని ప్రదర్శిస్తున్నారు..