కవాడిగూడ : దేశంలో ఎక్కడలేని విధంగా రజకులకు ఉచిత కరెంట్ను ఇవ్వడంతో పాటు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుటకు నిర్ణయించడం హర్షనీయ మని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రజక దోబీ అభివృద్ది సంస్థ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ఎం. అంజయ్య, తెలంగాణ రాష్ట్ర చైర్మన్ బొమ్మరాజు కృష్ణమూర్తిలు అన్నారు.
ఈ మేరకు ఆదివారం కవాడిగూడలోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాలలో వెనకబడిన రజకుల అభివృద్దికి సీఎం కేసీఆర్ ఉచిత కరెంట్ను ఇచ్చి సముచిత న్యాయం చేశారని అన్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల రజకులు తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటారని అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లకు వారు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల రజక సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.
అదే విధంగా పోరాట యోధురాలు ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్బండ్పై విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని వారు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ. అశోక్, గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ ఎం. నర్సింలు, తెలంగాణ రాష్ట్ర యువసేన చైర్మన్ జే. రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.