హుజూర్నగర్టౌన్, డిసెంబర్ 11 : లోక్ అదాలత్లతో కేసులకు సత్వర పరిష్కారం లభిస్తున్నదని సీనియర్ సివిల్ జడ్జి సీహెచ్ఎన్. మూర్తి అన్నారు. శనివారం పట్టణంలోని కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్లో కేసులను విచారించిన ఆయన లోక్ అదాలత్లో రాజీ కుదిరిన కేసుకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉండదన్నారు. దాంతో సమయం, డబ్బు ఆదా అవుతాయన్నారు. అదాలత్ ద్వారా 1620 క్రిమినల్ కేసులు, 7 సివిల్ కేసుల్లో కక్షిదారులు రాజీపడగా కేసులను మూసివేసినట్లు తెలిపారు. రూ.7 లక్షలు వివిధ బ్యాంకులకు బకాయి చెల్లింపులు కాగా కక్షిదారుల నుంచి రూ. 10 లక్షలు జరిమానాల రూపంలో కోర్టుకు జమ చేశారు. అదాలత్ సందర్భంగా కక్షిదారుల కోసం సీఐ రామలింగారెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి సంకేత్ మిత్ర, అదాలత్ సభ్యులు కాల్వ శ్రీనివాస్రావు, ప్రవీణ్, సురేశ్, సీఐ రామలింగారెడ్డి, ఎస్ఐలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్రెడ్డి, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
కోదాడటౌన్ : జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా శనివారం పట్టణంలోని కోర్టులో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా కోదాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్యాంసుందర్ మాట్లాడుతూ లోక్ అదాలత్తో కక్షిదారులకు సమయం, ధనం ఆదా అవుతాయన్నారు. ఈ సందర్భంగా కోర్టు ప్రాంగణం కక్షిదారులతో సందడిగా మారింది. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవబత్తిని నాగార్జున్రావు, కోదాడ డీఎస్పీ రఘు, లోక్ అదాలత్ సభ్యులు అక్కిరాజు యశ్వంత్, నాగుబండి కృష్ణమూర్తి, న్యాయవాదులు ఎస్ఆర్కే మూర్తి, సిలివేరు వెంకటేశ్వర్లు, ముల్క వెంకట్రెడ్డి పాల్గొన్నారు.
సూర్యాపేటలో172 కేసులు
సూర్యాపేట లీగల్ : సూర్యాపేట కోర్టుల పరిధిలో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్కు కక్షిదారులు పెద్ద మొత్తంలో హాజరై 172 కేసులను పరిష్కరించుకున్నారు. మొదటి బెంచ్కు మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, రెండో అదనపు జిల్లా న్యాయమూర్తి వసంత్ పాటిల్ అధ్యక్షత వహించగా సభ్యులుగా నారాయణ, రాముడు వ్యవహరించి 25 మోటర్ ప్రమాద కేసులు పరిష్కరించి బాధితులకు రూ.1.12లక్షలు నష్ట పరిహారంగా చెల్లించారు. రెండు అప్పిల్ కేసులను కూడా పరిష్కరించారు. రెండో బెంచ్కు సీనియర్ సివిల్ జడ్జి జితేంద్ర అధ్యక్షత వహించగా సభ్యులుగా ఫరీదుద్దీన్, యదగిరి వ్యవహరించి మూడు సివిల్ కేసులు, 6 ఫ్రీ లిటిగేషన్ కేసులు పరిష్కరించారు. 3వ బెంచ్కు ప్రధాన ప్రథమ శ్రేణి న్యాయమూర్తి కె.సురేశ్ అధ్యక్షతన సభ్యులుగా రామకృష్ణ, మధు వ్యవహరించి 75 క్రిమినల్ కేసులు, 5 సివిల్ కేసులను పరిష్కరించారు. 4వ బెంచ్కు అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి జె.ప్రశాంతి అధ్యక్షతన సభ్యులుగా సోమేశ్వర్, ప్రకాశ్ వ్యవహరించి 56 కేసులను పరిష్కరించారు.