చార్మినార్ : ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చోరీకి పాల్పడిన పాతనేరస్తులను మీర్చౌక్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు తెలిపిన వివరాల ప్రకారం పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే జావిద్ఖాన్ అలియాస్ జడ్డూ గౌస్పాషాలు స్నేహితులు.
ఈ నెల10న అర్థరాత్రి సమయంలో నిందితులు ఇద్దరు కలిసి యూపీహెచ్పీ జాంబాగ్ ఆసుపత్రిలో చోరీకి పాల్పడ్డారు. ఆసుపత్రిలో భద్రపర్చిన కోవిషీల్డ్, కోవాగ్జిన్ వాయల్స్తోపాటు చిన్నారులకు వివిధ రకాల రుగ్మతుల నుండి కాపాడే బీసీజీ, ఇతర టీకాలను చోరీ చేసి అక్కడి నుండి పారిపోయారు.
డాక్టర్ లింగమూర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని వేగవంతంగా దర్యాప్తును ప్రారంభించామని పోలీసులు తెలిపారు. అడిషనల్ ఇన్స్పెక్టర్ రాంబాబు ఆధ్వర్యంలో ఎస్సై రాజు మంగళవారం నిందితులను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. నిందితులు గతంలో నగరంలోని సుల్తాన్బజార్, చాధర్ఘాట్, బేగంబజార్, చిలకలగూడ పోలీస్ స్టేషన్ల పరిధిల్లో నేరాలకు పాల్పడినట్లు తెలిపారు.
నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి చోరీకి గురైన కరోనా టీకాలతోపాటు ఇతర టీకాలను, 59వేల నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నామని తెలిపారు.