బండ్లగూడ: గురువారం రాత్రి భారీగా కురిసిన అకాల వర్షంతో పలు ప్రాంతాలలోని ప్రధాన రహదారులు, బస్తీలలో వర్షం నీరు నిలిచి పోయింది. రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని ఆరాంఘర్, శివరాంపల్లి, అత్తాపూర్, పిల్లర్ నెంబర్ 191 తదితర ప్రాంతాలలో వర్షం నీరు నిలిచి పోయింది. వర్షాల వలన ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ మాన్సూన్ సిబ్బందిని రంగంలోకి దింపింది.
రంగంలోకి దిగిన మాన్సూన్ సిబ్బంది వర్షం నీరు సాఫీగా పోయేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అత్యవసర సమయంలో పనులు చేసేందుకు గాను జీహెచ్ ఎంసీ డివిజన్ల వారిగా మాన్సూన్ బృందాలను ఏర్పాటు చేసింది. గురువారం రాత్రి ఏకధాటిగా కురిసిన వర్షంతో వర్షం నీరు నిలిచి పోగా సిబ్బంది మ్యాన్హోల్లపై పేరుకు పోయిన చెత్తను తొలగించే పనులను చేపట్టారు. అర్థరాత్రి ఐనప్పటికీ సిబ్బంది రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు.