సైదాబాద్ : ప్రజల్లో ఆయుర్వేద వైద్య విధాన పద్దతులపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైన ఉందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. ధన్వంతరి జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఆయుర్వేద దినోత్సవ వేడుకలలో ఆయన పాల్గొన్నారు.
మంగళవారం సైదాబాద్ డివిజన్ పరిధిలోని రెవెన్యూ బోర్డు కాలనీలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ (సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్-మినిస్ట్రీ ఆఫ్ ఆయూష్)లో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయుర్వేద వైద్యంపై ప్రజల్లో అచంచలమైన విశ్వాసం ఉండటంతో అనేకమంది ఆయుర్వేద వైద్యాన్ని నేటికి ఉపయోగిస్తున్నారని, ఆయుర్వేద వైద్య చికిత్సద్వారా నొప్పి లేకుండా అనేక రుగ్మతలను నయం చేసే విధానాలు ఉన్నాయన్నారు.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ (సీసీఆర్ఎఎస్-మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్) ఇంచార్జీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జి.పి ప్రసాద్ మాట్లాడుతూ ఆయుర్వేద వైద్యంతో అనేక ఉపయోగాలు ఉన్నాయని, గృహ వైద్యం ఔషధ మొక్కలతో ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చని పేర్కొన్నారు. ఆయుర్వేదం ప్రాముఖ్యత, గృహ వైద్యం, ఔషధ మొక్కల ఉపయోగాలపై ఆయన వివరించారు.
ఈ సందర్భంగా కేంద్రీయ ఔషద మొక్కల సుగంధ మొక్కల సంస్థ పరిశోధన కేంద్రం సహకారంతో ఉచితంగా సుమారు వేయి ఔషద మొక్కలను విద్యార్ధులకు, వివిధ కాలనీలకు చెందిన కాలనీవాసులకు అందజేశారు. విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్ధులకు సర్టిఫికెట్లు, నగదు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆయుర్వేద రిటైర్డు డైరెక్టర్ డాక్టర్ బి. రామారావు, రిటైర్డు అసిస్టెంట్ డైరెక్టర్ మొమిన్ అలీ, ఆయుర్వేద రిసెర్చ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి, యునాని రీసెర్చ్ ఆఫీసర్ అశ్వక్ అహ్మద్, రీసెర్చ్ ఆఫీసర్లు డాక్టర్ సాకేత్రామ్, డాక్టర్ భిశ్వరంజన్ దాస్, పాఠశాల ఉపాధ్యాయులు శ్రీవాణీ, సంధ్య తదితరులు పాల్గొన్నారు.