ఏండ్ల కాలంగా పంట పెట్టుబడి కోసం అష్టకష్టాలు పడ్డ కర్షకుల బాధలను ‘రైతుబంధు’ దూరం చేసింది. చేతిల పైసల్లేక సమయానికి విత్తనాలు, ఎరువులు కొనలేక.. సాగు చేయలేక దిగులుపడ్డ అన్నదాతల గోస తీర్చింది. పేద రైతులకు భరోసా నింపింది. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మొదటి రెండు సీజన్లకు ఎకరాకు రూ.4 వేల చొప్పున అందించగా, ఆ తర్వాత నుంచి రూ.5 వేల చొప్పున ఖాతాల్లో వేస్తోంది. ఈసారి కూడా రైతుల ఖాతాల్లో విడుతల వారీగా నగదు జమ చేస్తున్నది. శుక్రవారం నాలుగో రోజూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. తమ సెల్ఫోన్లకు వచ్చిన మెస్సేజ్లు చూసుకుని రైతులు సంబురంగా బ్యాంకులకు వెళ్లి డబ్బులు డ్రా చేసుకుంటున్నారు. దున్నడానికి, కూలీలకు, ఎరువులకు సరైన సమయంలో పెట్టుబడి వచ్చిందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రైతన్న చేతికి పెట్టుబడి సాయం అందుతోంది. నాలుగో రోజూ బ్యాంకు ఖాతాల్లో జమ కాగా, రైతాంగం నగదు విడిపించుకుంటున్నది. ఏటీఎంలు, బ్యాంకుల వద్ద సందడి కనిపిస్తుం డగా,పెట్టుబడి తీసుకున్న రైతుల కండ్లలో సంతోషం కనిపిస్తున్నది. సాగు ఖర్చులకు సాయం పంపిన సీఎం కేసీఆర్ తమకు కనిపించే దైవమని రైతాంగం కొనియాడుతున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాలుగు రోజుల్లో 4,25,141 మంది రైతుల ఖాతాల్లో రూ. 394. 04 కోట్ల నగదు జమైంది.
కోటపల్లి, డిసెంబర్ 31 : నా పేరు కర్ణాటకం మధునయ్య. నాది మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం జనగామ గ్రామం. కష్టపడి ఎవుసం చేయడం.. భూమి తల్లిని నమ్ముకొని బతకడం తప్ప ఏమీ తెలియదు. ఇది వరకు షావుకార్ల వద్ద అప్పులు తెచ్చి ఎవుసం చేసేటోళ్లం. పంట పండినంక వడ్డీతో సహా కట్టేటోళ్లం. ఒక్కోసారి పెట్టుబడి మందమైనా పైసలు రాకపోయేటివి. మస్తు లాస్ అయ్యేటోళ్లం. అప్పులు పెరిగిపోయేటివి. ఇగ ఎవుసం లాభం లేదనుకొని కొందరైతే ఊర్లను వదిలి పట్టణాలకు పోయి కూలీ పనులు చేసుకున్నోళ్లు ఉన్నరు. తెలంగాణ వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంక మా జిందగీ మొత్తం మారిపోయింది. ఎవుసాన్ని పండుగలా మార్చిండు. రైతుబంధుతో దేవునోలే అండగా నిలిచిండు. నాకు మా ఊరిలో రెండున్నర ఎకరాల భూమి ఉంది. రైతు బంధు డబ్బులతో రూపాయి అప్పు తేకుండా ఎవుసం చేస్తున్నా. ప్రతిసారి మిరప పంట వేస్త. పంట వేసే టైంకి డబ్బులిస్తండు. గవ్విటితోనే విత్తనాలు, ఎరువులు కొనుక్కుంటు న్నం. మిగతా అవసరాలకు కూడా వాడుకుంటున్నం. నాకు రెండున్నర ఎకరాలకు సంవత్సరానికి రూ. 25 వేలు వస్తున్నయ్. ఈ సారి కూడా నా బ్యాంకు ఖాతాల రూ. 12500 జమ చేసిన్రు. గా పైసలు తెచ్చుకున్న. ఇది వరకున్న గవర్నమెంటోళ్లు గిట్లా ఎవుసానికి పైసలిచ్చి సాయం చేసింది లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల బాగు కోరి అన్నితీర్ల సాయమందిస్తున్నడు. -కర్ణాటకం మధునయ్య, జనగామ
రూపాయి అప్పులేకుండా..
కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ) : నాకు మా ఊరిలో 4.33 ఎకరాల భూమి ఉంది. ఇది వరకు ఎవుసం సాగాలంటే పెట్టుబడుల కోసం అప్పులు చేసేటోన్ని. ఇప్పుడు ఆ బాధ లేకుంటైంది. సీఎం కేసీఆర్ సార్ 2018 నుంచి రైతు బంధు కింద పంట పెట్టుబడికి డబ్బులిస్తండు. నాకు ఏడాదికి రెండు సార్లు రూ. 24 వేలు వస్తున్నయ్. ఈసారి కూడా నా బ్యాంకు ఖాతల డబ్బులేసిన్రు. ఇగ గీ పైసలతోనే పంటలు సాగు చేస్తున్న. నాకున్న చిన్న చిన్న అప్పులు కూడా తీర్చుతున్న. రైతుబంధు వల్ల రూపాయి అప్పులేకుండా పంటలు వేసుకుంటున్న.
చేయి చాచే పరిస్థితి పోయింది..
నార్నూర్, డిసెంబర్ 31: నా పేరు రాథోడ్ దిలీప్. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం భీంపూర్ గ్రామంల ఉంట. నాకు మూడెకరాల భూమి ఉంది. గతంల సాగు పెట్టుబడుల కోసం బయట నుంచి మిత్తికి తెచ్చేది. పంట దిగుబడి వస్తే కట్టేది. లేకుంటే మిత్తిలు పెరిగి చానా ఇబ్బందయ్యేది. కేసీఆర్ సారు తెచ్చిన రైతుబంధు పథకం నన్ను ఆదుకున్నది. నాకు రైతు బంధు కింద రెండు సీజన్లకు కలిపి రూ.30వేలు వస్తున్నయ్. గురువారం కూడా యాసంగికి రూ.15వేలు పెట్టుబడి సాయం నా ఖాతాల వేసిన్రు. వానకాలంల అచ్చిన పైసలతో పత్తి, కంది, ఇతర పంటలు సాగు చేసిన. యాసంగిల శనగ, గోధుమ, ఇతర పంటలు వేద్దమనుకుంటున్న. తెలంగాణ రాష్ట్రం అచ్చినంక ఎవుసానికి మంచి రోజులచ్చినయ్. 24 గంటల కరంట్ ఇస్తుండడంతో. రంది లేకుంటయ్యింది. గతంల రాత్రులు కరెంట్ ఉన్నప్పుడే పంటలకు నీళ్లు పెట్టేటోళ్లం. అప్పటి దాకా రాత్రుళ్లు పంటల కాడనే కావలి వండేది. ఇప్పుడు పొద్దంత కరెంట్ సౌలతు ఉంటం ది. దీంతో నీళ్లు పట్టుకొని మిగతా పనులు చేసుకుంటున్న. ప్రభుత్వం రైతుబంధు తెచ్చినంక పెట్టుబడి కర్సులు తగ్గినయ్. గతంల సేట్ల దగ్గర మిత్తికి తెచ్చి పెట్టుబడి పెట్టేది. ఇప్పుడు ఎకరానికి రెండు సీజన్లకు కలిపి పదివేలు వత్తన్నయ్. దళారుల నొక్కుడు లేకుండా ఖాతాల్నే పైసలు పడుతున్నయ్. ఎరువులు, ఇత్తనాలు కూడా సమయానికే ఇత్తన్రు. ఇగ ఇప్పుడు గ్రామాల్లో బీడు భూమి లేకుంటయింది. అందరూ ఎవుసమే నడిపిస్తున్నరు. రైతుబంధు చేయబట్టి వేరే పనులకు పోయినోళ్లు కూడా ఈడికే వచ్చిన్రు. భూముల ధరలు కూడా పెరిగినయ్. రైతుల కన్నీళ్లు తుడిచిన స్కీం తెచ్చిన్రు కేసీఆర్ సారు. నాకైతే కేసీఆర్ సారే దేవునిలెక్క కనపడుతుండు.
రైతుబంధు పైసలతో బాయి తవ్వించినం..
ఇంద్రవెల్లి, డిసెంబర్31: ఇంద్రవెల్లి మండలం వడగాం గ్రామపంచాయతీ పరిధిలోని మోడిగూడ గ్రామం మాది. ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు పైసలు మస్తు అక్కరకు వచ్చినయ్. మా అయ్య పేరిట 8 ఎకరాల 14 గుంటల భూమి ఉంది. రైతుబంధు ద్వారా రెండు సీజన్లకు కలిపి రూ. 84 వేలు వస్తున్నయ్. ఇప్పటి వరకు రూ. 6.72 లక్షలచ్చినయ్. రూ. 45 వేలతో బాయి తవ్వించినం. చేను చుట్టూ రూ. 25 వేలతో కంచె ఏర్పాటు చేసుకున్నం. అట్లనే నా పేరిట (ధర్ము) ఐదెకరాలకు అటవీ హక్కు పత్రం ఉంది. రైతుబంధు ద్వారా నాకు రెండు సీజన్లకు కలిపి రూ. 46 వేలు ఇస్తున్రు. నాకు, నాన్నకు కలిపి రూ. లక్షా 30 వేలు వస్తున్నయ్. రైతుబంధు డబ్బులు ఇస్తున్నప్పుటి నుంచి వడ్డీ వ్యాపారులను మర్శిపోయినం. ప్రభుత్వం ఇచ్చిన పైసలతో విత్తనాలు, ఎరువులు కొని వ్యవసాయం చేసుకుంటున్నం. వానకాలంల పత్తి, సోయా వేసినం. దిగుబడి బాగా వచ్చింది. ఈ యాసంగిల గోధుమ, జొన్న, శనగ వేస్తున్నం. ముఖ్యమంత్రి కేసీఆర్ సార్తోనే రైతులకు మంచి జరుగుతంది. ఆయన సల్లంగుండాలె.