ముషీరాబాద్: మహిళా పార్లమెంటరీ కమిటీ తెలంగాణ పర్యటనలో భాగంగా సోమవారం రాష్ట్ర మహిళా కమిషన్తో సమావేశమై మహిళా సాధికారతకు తీసుకుంటున్న చర్యలపై చర్చించింది. రాష్ట్రంలో మహిళల భద్రతకు తీసుకుంటున్న చర్యలు, పోలీసు శాఖ ఇతర విభాగాలతో సమన్వయం తీరుపై ప్రధానంగా చర్చించిన పార్లమెంటరీ కమిటీ మహిళల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ మహిళా కమీషన్ చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించింది.
పార్లమెంటరీ సభ్యురాలు డాక్టర్ హీనాకుమార్ గవిత్ ఆధ్వర్యంలో రాష్ట్రానికి వచ్చిన కమిటీ సభ్యులు సోమవారం రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో చైర్మన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి, సభ్యులతో సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో మహిళల భద్రలకు తీసుకుంటున్న చర్యలు, గృహింస కేసులు, పని ప్రదేశాలలో మహిళలకు వేధింపులు, అత్యాచార ఘటనలు, మరణాలు, ఫోక్సో చట్టం కేసుల పరిష్కారానికి కమిషన్ తీసుకుంటున్న చర్యలపై చర్చించారు.
ముఖ్యంగా పోలీసు శాఖ మహిళల కేసులు, భద్రత విషయంలో ఇతర విభాగాలతో వ్యవహరిస్తున్న తీరును కమిటీ సభ్యులు ఆరాతీశారు. మహిళా షెల్టర్ హోమ్ల నిర్వహణ, సేవలు, సఖి కేంద్రాల కేంద్రాల నిర్మాణం, పనితీరును మహిళా శిశుసంక్షేమ శాఖ కమిషనర్ డి.దివ్య దేవరాజ్ కమిటీ సభ్యులకు వివరించారు. రాష్ట్ర మహిళా కమిషన్ తరపున పలు సిఫార్సు లేఖలను అందచేశారు.
ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ సభ్యులు షహీన్ అప్రోజ్, కె.ఈశ్వరీబాయ్, కె.ఉమాదేవి యాదవ్, గద్దల పద్మ, సుధమ్ లక్ష్మీ, కె.రేవతిరావు తదితరులు పాల్గొన్నారు.