ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్
పంచవటి కాలనీలో పార్కు, ఓపెన్జిమ్ ప్రారంభం
మణికొండ, డిసెంబర్ 4 : పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ప్రతిపాదనలను రూపొందించి ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఎమ్మల్యే ప్రకాశ్గౌడ్ తెలిపారు. శనివారం మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీల్లో అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా అల్కాపూర్ టౌన్షిప్లోని ఎంజీ పార్కు, పుప్పాలగూడ మారుతీనగర్ పార్కు, మణికొండలోని కేపీఆర్ కాలనీ పార్కు, తిరుమల హిల్స్కాలనీలోని పార్కులను సందర్శించి ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వారితో మాట్లాడారు. రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం పంచవటికాలనీలో మున్సిపాలిటీ నిధులతో ఏర్పాటు చేసిన పార్కు, మినీ స్టేడియం, స్కేటింగ్గ్రౌండ్, ఓపెన్జిమ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆల్కాలనీస్ సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శివారు మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించిందన్నారు. పార్కుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. స్వచ్ఛ మున్సిపాలిటీలో మణికొండను అగ్రగామిగా నిలిపేందుకు ప్రజలు సైతం భాగస్వాములు కావాలన్నారు. ప్రస్తుతం మణికొండ మున్సిపాలిటీ 80వ స్థానంలో ఉందని కాలనీల్లో నివాసముంటున్న ప్రజలు బాధ్యతను గుర్తెరిగి స్వచ్ఛ సర్వేక్షణ్లో పాల్గొనాలన్నారు. ఇప్పటికే రూ.200 కోట్లతో నియోజకవర్గంలో తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకున్నామని, త్వరలోనే పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మణికొండ మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్, వైస్ చైర్మన్ నరేందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఫల్గుణ్కుమార్, డీఈ దివ్యజ్యోతి, జలమండలి జీఎం రవీందర్రెడ్డి, డీజీఎం శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ టీఆర్ఎస్ ఫ్లోర్లీడర్ రామకృష్ణారెడ్డి,టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు శ్రీరాములు, కౌన్సిలర్లు కావ్యశ్రీరాములు, లక్ష్మీనారాయణ, మీనా ముత్యాలు, కో-ఆప్షన్సభ్యులు సిద్దప్ప, తాజుద్దీన్ పాల్గొన్నారు.