ఉస్మానియా యూనివర్సిటీ : నగరంలో ప్రజలకు అత్యుత్తమ వైద్య సదుపాయాలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి చెప్పారు. పేదలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి సదుపాయాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
అందులో భాగంగానే ఇప్పటికే బస్తీ దవాఖానాలతో పాటు డయోగ్నస్టిక్ హబ్లను నెలకొల్పినట్లు వివరించారు. తార్నాక డివిజన్లోని తుకారాంగేట్, లాలాపేట ప్రభుత్వ ఆస్పత్రుల్లో హాస్పెటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ హాజరయ్యారు.
అనంతరం ఆమె ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రోగులతో సంభాషించి, అక్కడ నెలకొని ఉన్న సమస్యలను ఆరా తీశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ ఆస్పత్రిలో తగిన మౌలిక వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రాజశ్రీ, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సౌశీల్య రాణి తదితరులు పాల్గొన్నారు.