బొడ్రాయిబజార్, డిసెంబర్ 10 : జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తయేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి కోరారు. 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ టీకా రెండు డోసులు వేసుకోవాలన్నారు. సూర్యాపేట పట్టణంలోని 60 ఫీట్ల రోడ్ నర్సింగ్ కళాశాల, ఇంటిగ్రేటెడ్ కూరగాయల మార్కెట్లో అవిధంగా మునగాల మండలం బరాఖత్గూడెం, కృష్ణానగర్లో ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలను కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్యాక్సినేషన్ రిజిస్టర్లను, ఆన్లైన్ నమోదు విధానాన్ని పరిశీలించారు. వార్డు ఆఫీసర్, అంగన్వాడీ, ఆశ, మెప్మా, ఆర్పీలు, ఏఎన్ఎంలు తమ వార్డు పరిధిలో ఇంటింటికి తిరిగి వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, అర్హులైన విద్యార్థులంతా వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. వ్యాపారులు, దుకాణాల్లో పని చేసే గుమస్తాలు వ్యాక్సిన్ వేసుకొని ఉండాలన్నారు. వ్యాక్సినేషన్పై సిబ్బంది అశ్రద్ధ వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్పంచులు వీరంరెడ్డి లింగారెడ్డి, వీరమ్మ, పాల్గొన్నారు.
అర్వపల్లి : అర్హులందరికీ కొవిడ్ టీకాలు వేసి వందశాతం వ్యాక్సినేషన్ను పూర్తిచేయాలని మండల వ్యాక్సినేషన్ అధికారి, జిల్లా వ్యవసాయాధికారి రామారావు నాయక్ అన్నారు. మండలంలోని కాసర్లపహాడ్ గ్రామంలో వ్యాక్సినేషన్ను పరిశీలించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి నవీన్, ఏఓ దినాకర్, సీహెచ్ఓ చరణ్నాయక్, ఏఎన్ఎం నాగరాణి, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
కోదాడ రూరల్ : కరోనా వైరస్ భారిన పడకుండా రక్షణకు ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా వేసుకోవాలని మండల వైద్యాధికారి సుధీర్చక్రవర్తి సూచించారు. కాపుగల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామాల్లో విస్తృతంగా టీకా కార్యక్రమాన్ని నిర్వహించారు.
బాలింతలకు, గర్భిణులకు కొవిడ్ వ్యాక్సినేషన్
చిలుకూరు : మండల వ్యాప్తంగా గర్బీణీలకు, బాలింతలకు కొవిడ్ టీకాలు వేస్తున్నట్లు వైద్యాధికారి ప్రమోద్కుమార్ తెలిపారు. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో అర్హులకు టీకాలు వేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ శంకర్ పాల్గొన్నారు.
తుంగతుర్తి : మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానాతో పాటు వివిధ గ్రామాల్లో ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ ఉచిత టీకాలు పంపిణీ చేసినట్లు ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ నాగూనాయక్ తెలిపారు. కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి సముద్రాల సూరి, హెల్త్ అసిస్టెంట్లు నర్సింహాచారి, యాదగిరి, భారతి, కమల, ఉపేంద్ర పాల్గొన్నారు.
గరిడేపల్లి : కరోనా మహమ్మారిని రూపుమాపేందుకు పీహెచ్సీ పరిధిలోని అన్ని గ్రామాల్లో వ్యాక్సినేషన్ వందశాతం పూర్తికి సహకరించాలని కల్మల్చెర్వు వైద్యాధికారి సుధీర్ కోరారు. పీహెచ్సీ పరిధిలోని 17గ్రామాల్లో ఇప్పటికే వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని, మిగిలిన ఐదు గ్రామాల్లో సైతం వందశాతం పూర్తికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
మఠంపల్లి : కొవిడ్ వ్యాక్సినేషన్ వేగం పెంచాలని టీకాల మండల ప్రత్యేకాధికారి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.పెంటయ్య సూచించారు. మండలంలోని టీకాల సరళిని ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.