పారిశ్రామిక ప్రగతికి, ఉపాధి కల్పనకు రాష్ట్రప్రభుత్వం పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో.. కామారెడ్డి జిల్లాకు పరిశ్రమలు తరలి రానున్నాయి. సదాశివనగర్ మండలంలో కాళేశ్వరం ఆగ్రో లిమిటెడ్ సంస్థ రూ.303 కోట్లతో జ్యూట్ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వంతో సంస్థ ఎంవోయూ కుదుర్చుకుంది.
సదాశివనగర్, సెప్టెంబర్ 17 : పారిశ్రామిక ప్రగతిలో భాగంగా కామారెడ్డి జిల్లాకు నూతన పరిశ్రమలు రానున్నాయి. ఇప్పటికే పలు పరిశ్రమలు రాగా, కొత్త పరిశ్రమల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్లో పలు కంపెనీలతో మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం సదాశివనగర్ మండలంలోని లింగంపల్లి, జనగామ గ్రామాల శివార్లలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం భూములను గుర్తించింది. గతేడాది తహసీల్దార్ రవీందర్ ఆధ్వర్యంలో రెవెన్యూ, సర్వే అధికారులు లింగంపల్లి 79 సర్వే నంబర్లో 558 ఎకరాల 17 గుంటలు, జనగామ గ్రామ శివారులో 74 సర్వే నంబర్లో 164 ఎకరాల 27 గుంటలు, 12 సర్వే నంబర్లో 96 ఎకరాల 04 గుంటల భూమిలో సర్వే నిర్వహించారు. సర్వే నంబర్ల ప్రకారం రెవెన్యూ అధికారులు జేసీబీలతో హద్దులు సైతం ఏర్పాటు చేసి, ట్రెంచ్లు కొట్టారు. రాష్ట్రంలో జ్యూట్ పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి మూడు కంపెనీలు కాళేశ్వరం ఆగ్రో, గ్లోస్టర్, ఎంబీజీ ప్రతినిధులు ముందుకు వచ్చారు. దీంతో శుక్రవారం హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులతో రాష్ట్ర మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఒప్పందం చేసుకున్నారు. రూ. 303 కోట్లు పెట్టుబడితో జిల్లాలో పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో జిల్లాలో 3, 600 మందికి ఉపాధి కలుగనుంది.
పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉపాధి: ఎమ్మెల్యే జాజాల సురేందర్
ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 17: పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉపాధి మార్గం చూపడం ఎంతో సంతోషంగా ఉందని ఎ ల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. రాష్ట్ర రాజధానిలో కాళేశ్వరం ఆగ్రో లిమిటెడ్తో జరిగిన అవగాహ న ఒప్పంద కార్యక్రమం అనంతరం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతోనే నియోజకవర్గానికి అద్భుతమైన పరిశ్రమ వస్తోందన్నా రు. లింగంపల్లిలో ఏర్పాటు చేస్తున్న జ్యూట్ పరిశ్రమతో స్థానికంగా సుమారు 3,600 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలను ప్రోత్సహించడంతోనే ఎల్లారెడ్డి ప్రాంతానికి రూ.303 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేసిన సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, గంగుల, నిరంజన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.