నిజామాబాద్ రూరల్, డిసెంబర్ 8: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనం, పరిశుభ్రతతోపాటు అన్ని వసతులతో కూడిన వైకుంఠధామాలు నిర్మించేందుకు నిధులు మంజూరు చేస్తున్నది. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని ఒకటో డివిజన్లో ఉన్న కాలూర్ గ్రామంలో నిర్మించిన వైకుంఠధామం సకల సౌకర్యాలు కలిగి ఉండడంతో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మున్సిపల్ శాఖ నుంచి రూ.30లక్షలు మంజూరు చేయించి నిర్మించిన వైకుంఠధామం ప్రాంగణం పార్కును తలపిస్తున్నది. దహనసంస్కారాలు జరిపించేందుకు వచ్చిన వారికి మట్టి అంటకుండా ఉండేందుకు ప్రాంగణమంతటా పలుగురాళ్లు పరిచారు. దింపుడు కల్లెం, దహనవాటికలు, స్నానాల గదులు నిర్మించారు. ప్రాంగణంలో మొక్కలు నాటడంతో ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తున్నది.
సీఎం చొరవతోనే..
సీఎం కేసీఆర్ చొరవతో వైకుంఠధామాలు నిర్మించి, సుందరీకరణ పనులు చేపట్టేందుకు నిధులు మంజూరవుతున్నాయి. గత ప్రభుత్వాలు వైకుంఠధామాల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేలా వైకుంఠధామాన్ని అందుబాటులోకి తెచ్చాం.
ఎమ్మెల్యేకు రుణపడి ఉంటాం
మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమైన కాలూర్ గ్రామాభివృద్ధికి ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కృషి చేస్తున్నారు. నిధుల మంజూరుకు కృషి చేయడంతోనే వైకుంఠధామం ప్రాంగణంలో సుందరీకరణ పనులు పూర్తయ్యాయి. అభివృద్ధికి పాటుపడుతున్న ఎమ్మెల్యే బాజిరెడ్డికి గ్రామస్తులమంతా రుణపడి ఉంటాం.
-ముస్కె సంతోష్, నుడా డైరెక్టర్